ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతోంది.- ఇటీవల మలేరియా, డెంగీ, టైఫాయిడ్ ఇలా వివిధ వ్యాధులతో బాధపడుతూ ఓపికి వస్తున్న కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఒకప్పుడు రోజుకు పది ఇరవై కేసుల నుండి ఇప్పుడు ఏకంగా  ఐదు వందలకు పైగా వివిధ రకాల జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఫీవర్ ఆసుపత్రి జ్వర బాధితులతో నిండిపోతోంది. ఒక్క ఫీవర్ ఆసుపత్రి మాత్రమేకాదు హైదరాబాద్ లో ఏ దవాఖానాలో చూసినా ఇదే దుస్దితి.


తాగే నీరు, చుట్టూ ఉన్న అపరిశుభ్ర వాతావరణమే సీజనల్ వ్యాధులకు ప్రధాన కారణమవుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో చుట్టూ ఉన్న పరిసరాల్లో నీరు నిలిపోవడం సర్వసాధారణం. అందులోనూ బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్దితి మరీ దారుణం. భాగ్యనగరంలోని అనేక కాలనీలలో వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండటం. వ్యర్దాలు చేరడంతో డెంగీ దోమలు పాగావేస్తున్నాయి. దీంతో డెంగీ దోమల బారినపడి ఆసుపత్రి పాలవుతున్న వారి శాతం విపరీతంగా పెరుగుతోంది. సాధారణ రోజులతో పోల్చితే వర్షాకాలం డెంగీ వ్యాధి బాధితుల శాతం రెండు రెట్లు అదనంగా నమొదవుతున్నాయి.


నగరంలోని బస్తీలు,కాలనీలు డెంగీ దోమలకు అడ్డగా మారిపోయాయి.భాగ్యనగరంలోని ప్రతీ ఇంట్లో ఏదోరకం వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య  పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరంతో మొదలై ఒళ్లు నప్పులు, దగ్గు, జలుబు, వాంతులు ఇలా ఒక్కో లక్షణం బయటపడుతూ.. నెమ్మదిగా అశ్రద్ధ చేస్తే బాధితుడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఒక్క ఫీవర్ ఆసుపత్రి మాత్రమే కాదు, ఉస్మానియా, నిలోఫర్ లకు సీజనల్ వ్యాధులతో చేరుతున్న వారి సంఖ్య సైతం ఎక్కవగా నమోదవుతోంది. సాధారణ రోజులతో పోలిస్తే 40 నుండి 50 శాతం కేసులు జ్వరాల బాధితులే కనిపిస్తున్నారు.


ఇలా గుర్తించొచ్చు!


సాధారణ జ్వరానికి, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలకు తేడా ఎలా గమనించాలి? వచ్చిన జ్వరం సాధారణ జ్వరమా లేక సీజనల్ వ్యాధుల్లో భాగమా అనే అనుమానాలు ప్రతీ ఒక్కరిలో ఉంటాయి. కాస్త ఒళ్లు వెచ్చబడి, నలతగా ఉంటే కొంత మంది కంగారుపడిపోతారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సోకాయా అనే అనుమానాలు వెంటాడుతాయి. దీంతో బాధితుల్లో ఆందోళన మొదలవుతుంది. కొందరైతే డాక్టర్ ను సైతం సంప్రదించకుండా మెడికల్ షాపులో ఇచ్చిన కోర్సులు వాడేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మందులు మింగేస్తుంటారు. మరి కొందరైతే నిజంగా విపరీతమైన జ్వరంతో మూడు, నాలుగు రోజుల నుండి బాధపడుతున్నా ఎవరికీ చెప్పకుండా, అదే తగ్గుతుందే నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలా సరైన అవగాహాన లేక సీజనల్ వ్యాధుల విషయంలో పరిస్దితులు చేయిదాటే వరకూ తెచ్చుకుంటున్నారు.


సీజనల్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి. ఏ లక్షణాల ఆధారంగా మనకు సోకింది మలేరియానా, టైఫాయిడ్ , డెంగీనా అని గుర్తించడం ఎలా..? ఇలా అనేక సందేహాలు సాధారణంగా ప్రతీ ఒక్కరిలో వస్తుంటాయి. వీటిని గుర్తించడంలో అప్రమత్తంగా ఉంటం అవసరమంటున్నారు వైద్యులు. సీజనల్ వ్యాధులు సోకితే తీవ్రమైన జ్వరంతోపాటు కాళ్లు చేతులు మంటగా ఉంటాయి. విపరీతమైన నీరసంగా ఉంటుంది. జ్వరం, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్ వాయుట, దగ్గు, ఆయాసం, విరేచనాలు ఇలా వీటిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తాయి.


కరోనా సోకినా దాదాపు ఇవే లక్షణాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా వైద్య పరిక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే నెమ్మదిగా ఇంట్లో ఉన్న అందరికీ సోకుతుంది. మూడు లేదా నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకపోతే ఖచ్చితంగా అది డెంగీ లేదా మలేరియా లక్షణాలుగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు ఉంటే టైఫాయిడ్  పరీక్షలు చేయించుకోవడం అవసరం. బాక్టీరియా ఇన్ఫెక్షన్ తో జ్వరం నెమ్మదిగా పెరుగుతూ నాలుగు లేదా ఐదు రోజుల్లో తారస్థాయికి చేరుతుంది.నలతగా జబ్బు పడినట్లు కనిపించడంతోపాటు ముఖ కవళికలు మారిపోతాయి. ఇలా ఒక్కో సీజనల్  వ్యాధి వల్ల సాధారణ జ్వరం లక్షణాలకు భిన్నంగా శరీరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని పీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.శంకర్ ఏబీపీ దేశం ఇంటర్వూలో తెలిపారు.