Fancy Number: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వాహనాలకు నెలవైన హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. సెంటిమెంట్, ఇష్టమైన నంబర్ కావాలని చాలా మంది కోరుకుంటారు. ఇష్టంగా కొనుక్కున్న వాహనానికి అంతే ఇష్టంగా ఫ్యాన్సీ నంబర్ కావాలనుకుంటారు. అందుకోసం.. వాహనానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువైనా పెడుతుంటారు. ఈ విపరీతమైన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకునే.. రాష్ట్ర రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహిస్తుంది. అలా హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో మంగళవారం (సెప్టెంబర్ 5) జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో ఫ్యాన్సీ నంబర్లు భారీ ధర పలికాయి. 


ఈ క్రమంలోనే హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలో ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం రోజు కాసుల పంట పండింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.18 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 11 ఈజెడ్ 9999 అనే నంబర్ కు రూ.9,99,999లు పలికింది. ఈ ఫ్యాన్సీ నంబర్ ను చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకుంది. అలాగే టీఎస్11 ఎఫ్ఏ 0001 నంబర్ ను రూ.3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకున్నారని రవాణా శాఖ పేర్కొంది. అదే సిరీస్ తో 0011 నంబర్ ను శ్యామల రోహిత్ రెడ్డి రూ. 1.50 లక్షలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.


గత నెలలో 9999 నంబర్‌కు రూ.21.60 లక్షలు


గత నెల ఆగస్టులో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ కాసుల పంట పండించింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్ కు రూ.21.60 లక్షలు పలకగా.. అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్ కు రూ.1.04 లక్షలు పలికింది.


ఇటీవలే సిమ్లాలో కోటి 12 లక్షల 15 వేల 500లకు వేలం


హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆసక్తికరమైన కేసు వెలుగు చూసింది. ఇక్కడ కొట్‌ఖాయ్ లైసెన్స్ అథారిటీలో ఓ వ్యక్తి స్కూటీ వీఐపీ నంబర్‌కు రూ.1 కోటి 12 లక్షల 15 వేల 500 వేలం వేశారు. ఈ విషయం గురువారం నాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఈ వీఐపీ నంబర్ కోటి రూపాయలకు పైగా అమ్ముడైంది. వీఐపీ నంబర్ కోసం కోట్లకు వేలం వేసిన వ్యక్తి పేరు దేశరాజ్. అయితే ఇతను ఎక్కడ నివసిస్తున్నాడనే సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితిలో, ఇది ఆన్‌లైన్ మోసం కూడా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూటీ కోసం ఎవరైనా కోట్లాది రూపాయలను వేలం వేస్తే ఎలా అని అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఇప్పుడు దేశరాజ్ మూడు రోజుల్లో 30 శాతం డబ్బులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ అదనపు డైరెక్టర్ హెమిస్ నేగి మాట్లాడుతూ.. దరఖాస్తుదారు దేశ్‌రాజ్ స్కూటీ యొక్క వీఐపీ నంబర్ కోసం రూ. 1.12 కోట్లకు పైగా వేలం వేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బిడ్‌లో వ్యక్తి పేరు మాత్రమే కనిపించిందని అన్నారు. ఆ వ్యక్తి ఆచూకీని ఇంకా ఆ శాఖ గుర్తించలేకపోయిందని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో గందరగోళం ఉండవచ్చని... ఇది ఎవరో కావాలని చేసి ఉంటారని భావిస్తున్నారు.