Hyderabad News: హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీరాముడి శోభ యాత్ర వైభవంగా జరుగుతోంది. భక్తులంతా ఎక్కువ మంది కాషాయ వస్త్రాలు ధరించి ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ బంద్ చేసేయడంతో రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే, ఈ యాత్రలో దొంగల ముఠా హల్చల్ చేసింది. రోడ్డు పై నిలబడ్డ భక్తుల బంగారు చైన్లు, బ్రేస్ లేట్, మొబైల్ ఫోన్స్ చోరీ చేసింది. దీంతో మంగళ్ హాట్ పీస్ లో 35 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. 


ఈ శ్రీరాముడి శోభాయాత్రలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆయన రాముడి పాటలు కూడా పాడుతూ భక్తులను మరింత ఉర్రూతలూగించారు. ఈ రాజాసింగ్ యాత్రలో దొంగల ముఠా డాన్స్ చేస్తూ అందర్నీ మైమరిపించేలా చేసి.. వారి బంగారం, మొబైల్స్ ను కొట్టేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో గందరగోళం క్రియేట్ చేసి మెడపై ఉన్న బంగారాన్ని తెంపుకుపోయిందని పోలీసులు చెప్పారు. కొట్టేసిన వస్తువులను క్షణాల్లో ముఠా సభ్యులే చేతులు మార్చుకొని అక్కడి నుంచి మాయం అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలా పలువురు దొంగలు బంగారు గొలుసులు దొంగిలించి పారిపోతుండగా.. భక్తులు పట్టుకొని వారిని పోలీసులకు అప్పగించారు.


ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో సీతారాముల శోభాయాత్ర జరుగుతోంది. సీతారామ్ బాగ్ టెంపుల్, మంగళ్ హాట్ నుంచి హనుమాన్ వ్యాయామశాల, సుల్తాన్ బజార్ వరకూ శోభాయాత్ర జరుగుతోంది. కాబట్టి, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన యాత్ర.. పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటనుంది. ఈ యాత్ర బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళ్ హాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్ చత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీల మీదుగా  శ్రీరామ శోభయాత్ర సాగుతుంది. ఈ మార్గంలో ప్రధాన శోభాయాత్రలో చుట్టుపక్కల నుంచి వచ్చే చిన్న చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.