Hyderabad Ganesh Laddu Auction 2023: హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ ఎంత ఫేమస్సో బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. ఈ లడ్డూ ప్రతీసారి లక్షల్లో ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కానీ బాలాపూర్ లడ్డు ధరను కూడా బ్రేక్ చేసి ఏకంగా కోటి 26 లక్షల ధరకు అమ్ముడుపోయింది మరోలడ్డు. 


అదెక్కడ అంటే?


బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలోని వినాయకుడి లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. కోటి 26 లక్షల రూపాయలతో ఓ వ్యక్తి ఈ లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నాడు. అలాగే మాదాపూర్ లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ భారీ ధర పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయక లడ్డూ వేలంలో పాల్గొని రూ. 25.50 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 


బాలాపూర్ లడ్డూను ఎవరు దక్కించుకున్నారు?


బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలంలో ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది బాలాపూర్‌ గణేష్ లడ్డూ వేలంపాటలో 36 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికితే ఈసారి అంతకు మించిపోయింది. 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన  దాసరి దాయనంద్ రెడ్డి దక్కించుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వేలాంపాటలో పాల్గొనాలనే వాళ్లంతా ఉత్సవ కమిటీకి ముందుగానే ఇవ్వాలని తీర్మానించారు.


గతేడాది లడ్డూ దక్కించుకున్న లక్ష్మారెడ్డి   


గతేడాది ఈ లడ్డూ 24 లక్షల 60 వేలు చెల్లించి వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఈయన ఈసారి కూడా వేలంలో పాల్గొన్నారు. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు. తొలుత నిర్వహకులు లడ్డూ ధరను 5 లక్షల నుంచి ప్రారంభించారు. బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోయారు. చివరకు 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.


గణేష్ లడ్డూ వేలం అనగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో నగరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూను వేలం వేయడాన్ని మొదట ప్రారంభించింది అక్కడే. మొదట కొంత మొత్తం ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ.. బాలాపూర్ లడ్డూ వేలం ధర వేలు, 10 వేలు, లక్షలు దాటి పదుల లక్షల్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం దాని రికార్డును అదే బద్దలు కొట్టుకుంటోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు తమకు చాలా మంచి జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. అది వారికి, వారి కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు మేలు జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది. బాలాపూర్ లడ్డూను ఎలాగైన సొంతం చేసుకోవాలన్న కాంక్ష పెరిగి పోయింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు సైతం వెచ్చించడానికి వెనకాడటం లేదు.