Hyderabad News: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఏమాత్రం అలసత్వం వహించిన గ్రూప్ మెంబెర్స్ డేటా అంతా నేరస్థులకు చేరుతుందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల సూచించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు కూడా సైబర్ మోసాలు తప్పడం లేదని వివరించారు. అమెరికాకి చెందిన వాట్సప్ గ్రూప్స్ నుంచి సైబర్ నేరస్థులు డేటాను సేకరిస్తున్నారని చెప్పారు. అలా సేకరించిన డేటా ఆధారంగా ఓ ఎన్ఆర్ఐ మహిళను బెదిరించినట్లు తెలిపారు. లక్ష రూపాయల లోన్ కట్టాలని తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆమె స్నేహితులను కూడా వేధించినట్లు వివరించారు. నేరుగా ఇండియా నోయిడాలోని బ్యాంక్ కి వచ్చి సెటిల్ చేసుకోవాలంటూ.. వేదించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు లక్షల రూపాయలు చీటర్స్ చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


నాలుగు నెలల క్రితం సిరిసిల్ల కలెక్టర్ ను టార్గెట్ చేసిన నేరస్థులు..


నిన్న మొన్నటి వరకు సామాన్యుల పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి స్నేహితులు, బంధువులను డబ్బులు అడుగుతూ చీట్ చేసేవారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల స్ట్రాటజీ మార్చిన సైబర్ నేరగాళ్లు ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లను వాడేస్తూ కింది స్థాయి అధికారులతో సహా సామాన్యుల వద్ద డబ్బు కొట్టేస్తున్నారు. ఉన్నతాధికారుల ఫొటోలు, పేరుతో చీటింగ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కలెక్టర్ , ఎస్పీ పేరుతో తరచుగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ కిందిస్థాయి సిబ్బందికి మెసేజ్ పంపుతూ డబ్బులు అడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ నేరానికి ప్రయత్నించిన కేటుగాళ్లు ఈసారి ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇలాగే ఓ అధికారికి కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. గతంలో జరిగిన సంఘటనతో అప్రమత్తమైన కిందిస్థాయి  అధికారి నువ్వు ఎవరు? అంటూ అతన్ని ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన సైబర్ నేరగాడు ప్రొఫైల్ లో తన ఫోటో చూస్తే తెలియడం లేదా? రాను రాను మేనర్స్ లేకుండా పోతోందంటూ అధికారిని బెదిరించాడు.  


అమెజాన్ గిఫ్టు కార్డులతో మోసం.. 


ప్రొఫైల్ లో చూస్తే జిల్లా కలెక్టర్ ఫోటో ఉంది. అయితే ఆ  అధికారి కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చాడు. నేను ప్రధాని మోదీ ఫొటో ప్రొఫైల్ పిక్చర్ లాగా పెట్టుకోగలను అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా ఆ కేటుగాడ్ని నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు అధికారి. నేను కలెక్టరేట్ లోనే ఉన్నాను అంటూ రిప్లై ఇచ్చాడు సైబర్ నేరగాడు. డబ్బులు అడిగితే అలర్ట్ అవుతున్నారని అమెజాన్ గిఫ్ట్ కార్డులు కావాలంటూ దీనికి సంబంధించి డబ్బులను ఒక గంటలోనే అరెంజ్ చేస్తానంటూ మెసేజ్ లో చెబుతున్నారు. అయితే ఈ విషయం కలెక్టర్ కి చేరడంతో మరోసారి ఎవరు ఇలాంటి మెసేజ్ కు స్పందించి డబ్బులు పంపవదంటూ కలెక్టర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటీవల ఇలాగే జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.