Hyderabad Crime News: ప్రతిరోజూ జిమ్ కు వచ్చే ఓ మైనర్ బాలిక.. వ్యాయామం చేస్తుండగా ఆమెను తాకుతూ వీడియోలు తీసుకున్నాడు ట్రైనర్. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా మైనర్ బాలికను మోసం చేసి 20 తులాల బంగారంతోపాటు 4 లక్షల రూపాయలను కొట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


అసలేం జరిగిందంటే..?


సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న రాజు ఓ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. తరచుగా వ్యాయామశాలకు వచ్చే ఓ బాలికతో అనేక రకాల వ్యాయామాలు చేయించేవాడు. ఈ క్రమంలోనే ఆమెను తాకుతూ.. ఆమెకు తెలియకుండా వీడియోలు తీసుకున్నాడు. వాటి సాయంతో తనతో బాలిక సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశాడు. ఆపై వాటిని ఆమెకు చూపిస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు ఇస్తే వాటిని అలాగే ఉంచుతానని.. లేని పక్షంలో అందరికీ చూపిస్తానంటూ వేధించసాగాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన బాలిక.. పలు దఫాలుగా బంగారం, డబ్బును తీసుకొచ్చాడు. ఇలా 20 తులాల బంగారంతోపాటు 4 లక్షల రూపాయల నగదును తీసుకున్నాడు. 


అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా చెప్పి అతడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి... నిందితుడు రాజుని అరెస్ట్ చేశారు. 


ప్రేమ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య


యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లిక్ పల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఉప్పునూతల కావ్య.. చౌటుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. అయితే బాలిక అప్పుడప్పుడూ సోషల్ మీడియా వాడేది. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి యాప్స్ వాడేది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి.. కావ్యకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ‌్‌లు పంపించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడు. అయితే అమ్మాయి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో శివమణి బెదిరింపులకు పాల్పడేవాడు, మీ అన్నను, నాన్నను చంపేస్తానంటూ వేధించేవాడు. డబ్బులు కూడా ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడ్డ కావ్య ఇటీవలే ఆ విషయాన్ని తన సోదరుడు నరేష్ కు తెలిపింది. దీంతో తన చెల్లికి మెసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేష్ హెచ్చరించాడు. 


ఇదే క్రమంలో డిసెంబర్ 31వ తేదీన నరేష్, శివమణి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం సద్దుమణిగాక ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే శివమణి మళ్లీ కావ్యకు ఫోన్ చేసి ఈరోజు మీ అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన కావ్య.. తాను చనిపోతే ఈ సమస్య తీరుతుందని భావించింది. వెంటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. అదృష్టవశాత్తు కావ్య ప్రాణాలతో బయటపడింది. ఈనెల 2వ తేదీన కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కూడా అయింది. అయితే తమ కూతురు ఆత్మహత్య వరకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టించారు. అయినప్పటికీ శివమణి మరోసారి ఆమెతో గొడవ పడడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.