సైబర్ నేరాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. సామాన్యులు, ఉన్నత విద్యావంతులు, ప్రముఖులనే కాదు.. ఏకంగా నేరాల్ని అదుపు చేయాల్సిన పోలీసులనే వారు వలలో వేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఓ ఘటన. హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలోని ఓ పోలీసు ఉన్నతాధికారిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. న్యూడ్ వీడియోల పేరుతో ఏకంగా ఆయన నుంచి రూ.97,500 వరకూ కాజేశారు. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం ఈ సైబర్ మోసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథానికి కొద్ది రోజుల క్రితం అపరిచిత యువతుల నుంచి కాల్ వచ్చింది. తర్వాత వారు చాటింగ్ కూడా చేశారు. అంతే కాకుండా నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడారు. దాన్ని రికార్డు చేసిన మాయగాళ్లు, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అయితే, డిప్యూటీ సూపరింటెండెంట్ దాన్ని పట్టించుకోకపోవడంతో సైబర్ నిందితులు మరో పన్నాగానికి తెర లేపారు. 


సీబీఐ అధికారి పేరుతో దశరథానికి ఫోన్ చేశారు. అవతలి సైబర్ నిందితుడు అజయ్‌ కుమార్‌ పాండే పేరుతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌ లో ఉందని తమకు ఫిర్యాదు అందిందని తనకు డబ్బు చెల్లిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకోబోమని నమ్మించాడు. అంతటితో ఆగకుండా సీబీఐ పేరుతో ఓ ఫేక్ లెటర్ కూడా పంపాడు. రాహుల్‌ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి కాల్‌ చేయాలని సూచించాడు. 


బాధితుడు అతడికి ఫోన్‌ చేశాక వీడియోలు డిలీడ్ చేసేందుకు ఏకంగా రెండు సార్లుగా రూ.97,500 సొమ్మును ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత తన దగ్గర మరో 2 న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాటిని వైరల్‌ చేయకుండా ఉండాలంటే ఇంకో రూ.85 వేలు పంపాలని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో డ్యూటీలో ఉండగా తరచూ కంగారుగా కనిపిస్తున్న దశరథాన్ని కొలీగ్ అయిన మరో పోలీసు ఉన్నతాధికారి గమనించి ఆరా తీశారు. 


ఏమైందని ప్రశ్నించగా, దశరథం జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఇది సైబర్‌ మోసం అని చెప్పి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇవ్వడంతో బాధితుడు కుషాయిగూడ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు పశ్చిమబెంగాల్‌ నుంచి మోసం చేసినట్లుగా గుర్తించారు.