Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్ఏఎంఎల్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ అంచనా రూ. 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, మెకానికల్, ఎలక్ట్రికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది. రోలింగ్ స్టాక్(రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటో మేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల పనులు చేపట్టాలి. ఎయిర్‌ పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. భూసామర్థ్య పరీక్షలు కూడా ఇప్పటికే సాగుతున్నాయి.


రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి ఎయిర్‌పోర్టు టెర్మినల్ స్టేషన్ వరకు 31 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇందులో 29.3 కిలో మీటర్లు ఎలివేటెడ్ కాగా.. అండర్ గ్రౌండ్ లో 1.7 కిలో మీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్ కు ఆనుకుని ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌ తో కలిపి రాయదుర్గం నుండి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 9 స్టేషన్లు ఉండనున్నాయి. 


అవసరమైతే అదనపు స్టేషన్లు


ఎయిర్ పోర్టు మెట్రో రైలు నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న సంస్థలు జులై 5వ తేదీ లోగా టెండర్ పత్రాలను తెలంగాణ ప్రభుత్వం ఇ-పోర్టల్ http://tender.telangana.gov.in లో అప్ లోడ్ చేయాలని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగర శివారు ప్రాంతాల్లో మధ్య తరగతి వారి కోసం తక్కువ ఖర్చుతో నివాస ప్రాంతాలు అభివృద్ధి చేసి ఎయిర్ పోర్టు మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.


ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ వేర్వేరు


రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టుకు మొత్తం వ్యయం అంచనా రూ. 6,250 కోట్లు. అయితే ప్రస్తుతం మాత్రం రూ. 5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండింటి మధ్య తేడా గురించి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ వేర్వేరని చెప్పుకొచ్చారు ఎన్వీఎస్ రెడ్డి. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టీ మాడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవని.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయని తెలిపారు. అందుకే ప్రాజెక్టు వ్యయం, టెండర్ మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు.