గణనాథుడి నిమజ్జనం హైదరాబాద్‌లో కోలాహలంగా సాగుతోంది. గణేష్‌ ఉత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరాయి. ట్యాంక్ బండ్‌ పరిసర ప్రాంతాల్లో  ఏకదంతుడి విగ్రహాలు బారులు తీరాయి. పోలీసులు బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. 


ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర సందడిగా సాగుతోంది. ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. ఇవాళ వేకువజామునే ఖైరతాబాద్‌ పార్వతీతనయుడి విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. 


నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. 


నిమజ్జనానికి హుసేన్ సాగర్‌తోపాటు 33 చెరువులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇక్కడ 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్‌ బృందాలను రెడీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా వంద వరకు కృత్రిమ చెరువులు నిర్మించారు. 


నిమజ్జనం సందర్భంగా రాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీస్‌లు పొడిగించారు. ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, గాంధీభవన్‌, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, పీవీ మార్గ్‌ పరిసరాల్లో ఉన్న పార్కులన్నీ మూసివేస్తున్నారు. 


వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం  ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.


చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను డైవెర్ట్ చేశారు. కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌ బండ్‌పైకి అనుమతి ఉండదు. సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాల మళ్లిస్తున్నారు. టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లించారు. 


చాపెల్ రోడ్డు, జీపీవో గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ప్రవేశం, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద వాహనాల డైవర్ట్ చేస్తన్నారు. 


హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాల మళ్లిస్తున్నారు. 


నిమజ్జనం చేశాక ఎలా వెళ్లాలంటే
ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించడం లేదు. 
 
ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు
ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే వారి కోసం సాగర్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రమే వాహనదారులు వాహనాలు నిలిపేలా చూస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసులు  పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


నిమజ్జనం రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్‌కు కొద్ది దూరంలోనే సిటీ బస్సులను నిలిపివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం బస్సులను మాసాబ్ ట్యాంక్, కూకట్‌పల్లి బస్సులు ఖైరతాబాద్ చౌరస్తా, సికింద్రాబాద్ బస్సులు సీటీవో, ప్లాజా, ఎస్ బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులు రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్ సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం, చాదర్ ఘాట్, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హట్స్, మిదాని బస్సులు ఐఎస్ సదన్, అంతర్ నగర బస్సులు నారాయణ గూడ వైఎంసీఏ వద్ద నిలిపేస్తున్నారు. 


ఓఆర్ఆర్ మీదుగా ప్రైవేటు బస్సులు
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు, అలాగే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతించడం లేదు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్‌ 7 వైపు నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ చౌరస్తా, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు