Fire Accident: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టాటానగర్‌లోని ఓ పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్లాంకెట్లకు మంటలు అంటుకుని మంటలు వేగంగా గోదాం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.


కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగలు అలముకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు దట్టంగా పొగలు అలముకోడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.