హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నైజీరియన్స్ డ్రగ్ సప్లై చేస్తున్నారు. 11 లక్షల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ సీజ్ చేసింది. ఈ కేసులో ఒక నైజీరియన్ అరెస్ట్ అయ్యారు..


తాజాగా పోలీసులు డ్రగ్స్ సరఫరాదారుణ్ని పట్టుకున్నట్లుగా ప్రకటించారు. ఆయన అరెస్టుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలకమైన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌ కేసులో డేవిడ్ హుకా అనే నైజీరియన్‌ ఉన్నాడని, అతణ్ని అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.


ఈ నైజీరియన్‌ డేవిడ్ హుకా 8 ఏళ్ళ క్రితం బెంగళూరుకు వచ్చాడని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి తన పేరును డేవిడ్ హుకాగా మార్చుకున్నాడని చెప్పారు. నకిలీ వీసా, నకిలీ గుర్తింపు కార్డులతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడని చెప్పారు. ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు వాడుతూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని సీపీ వెల్లడించారు. అంతేకాకుండా, ఇతడిలో లీడర్షిప్ అధికమని, ఏకంగా ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశాడని అన్నారు. డ్రగ్స్, గంజాయి కేసులో నైజీరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం లాంటివి కూడా ఇతను చేస్తుంటాడని వెల్లడించారు. 


వారిని తిరిగి వారి దేశాలకి పంపించడం వంటి విషయాల్లో డేవిడ్ హుకా కీలకపాత్ర వహిస్తాడని సీపీ అన్నారు. ఇతని కోసం బెంగళూరుకు వెళ్లి కాపు కాసి పక్కా ప్రణాళిక ప్రకారం పట్టుకున్నామని వెల్లడించారు. డేవిడ్ హుకా నుంచి 264 MD పిల్స్ ని సీజ్ చేశామని అన్నారు. దాదాపు అతని నుంచి రూ.4 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లుగా సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.


హైదరాబాద్‌లో గంజాయి స్వాధీనం


నేడు ఉదయం హైదరాబాద్‌లో కోటి రూపాయల గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అది సరఫరా చేస్తున్న ఆరుగురు గంజాయి సరఫరాదారులను కూడా అరెస్ట్ చేశారు.