Telangana State Song: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ..’ పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గానూ సీఎం రేవంత్ వీరితో భేటీ అయ్యారు. త్వరలో వీరి ఆధ్వర్యంలో మరింత నూతనంగా జయజయహే పాట రూపుదిద్దుకోబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరు ఉంది. ఇప్పటికే ఉన్న ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను అందెశ్రీ రచించారు. ఈ పాట చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనా గీతంగా కూడా ఈ పాటను పాడుకుంటారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.