హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ధర్నా వేదికపై నిరసన చేపట్టారు. వేదికపై కూర్చొని ప్రకార్డులు ప్రదర్శిస్తూ.. వడ్లు కొనబోమన్న కేంద్ర నిర్ణయాన్ని ఎండగట్టారు. అక్కడ వేదికపై వరి కంకులను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరి పంటను తెలంగాణ నుంచి కొనాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.


ఇది ఆరంభమే.. అంతం కాదు..: కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. ఇది ఇప్పటితో ఆగదు. గ్రామాల్లోనూ ఈ పోరాట వ్యూహాలను అమలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం సాగుతుంది. అవసరమైతే ఉత్తర భారతంలో నిరసన చేస్తున్న రైతులను కూడా కలుపుకొని పోతాం. గతంలో మన వ్యవసాయ మంత్రి రైతుల సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవించారు. నిన్న నేను కూడా ప్రధాని లేఖ రాశా. కానీ, ఇంత వరకూ ఎలాంటి సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకూ మన నిరసన కొనసాగుతుంది’’ అని కేసీఆర్ మాట్లాడారు.


తెలంగాణలో వ్యసాయం, రైతులు సుభిక్షంగా ఉంటున్న తరుణంలో ఇలా ప్రయోజనాల కోసం నిరసనలు తెలపాల్సి రావడం విచారకరమని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏ రైతు కుటుంబంలో చూసినా ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం సహించడం లేదని అన్నారు. రాజ్యాంగపరమైన విధి నిర్వర్తించాలని కోరుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. 


Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌


‘‘తెలంగాణ నుంచే అధిక వడ్లు కొన్నామని గతంలోనే ఎఫ్‌సీఐ ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులు కూడా తెలంగాణ వ్యవసాయం పట్ల గతంలో అభినందించారు. ఇప్పుడు కేంద్ర పెద్దలు మాటలు మార్చుతున్నారు. తొండి పంచాయితీ పెడుతున్నారు. తెలంగాణలో వానాకాలం పంట 62 లక్షల ఎకరాలని మనం చెబుతుంటే.. వారు నమ్మకుండా తాము పరిశీలించి నిర్ణయిస్తామని శాటిలైట్ ఆధారిత పరిశీలన చేపట్టారు. చివరికి 59 లక్షల ఎకరాల వరి ఉందని తేల్చారు. తెలంగాణలో ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల వ్యవసాయం మెరుగుపడింది.


Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?


రైతుల సహనం పరీక్షించొద్దు
న్యాయబద్ధంగా మనం రైతుల అంశాలపై పోరాడుతుంటే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి హంగామా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటుంటే.. బండి సంజయ్ లాంటివారు ఆ కేంద్రాల వద్దకు వెళ్లి వరి కొనాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాన కూడా మంట పెట్టి రైతుల సహనాన్ని పరీక్షించొద్దు. ఈ ధర్నా ద్వారా అదే చాటుతున్నాం. ‘దేశం కోసం.. ధర్మం కోసం..’ అనే మీరు తెలంగాణలో పండే మొత్తం వడ్లను కొంటామని లిఖితపూర్వకంగా ప్రకటించండి.’’ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు.


Also Read: KTR: నిర్మల్ కలెక్టర్ పెద్దమనసు.. మంత్రి కేటీఆర్ ప్రశంసలు, స్థానికులు కూడా..


Also read: KBR Park దాడి కేసులో స్పందించిన నటి.. షాకింగ్ విషయాలు, అసలు ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే..