క్యాసినోల నిర్వహణ కేసులో అప్పట్లో సంచలనం కలిగించిన చికోటి ప్రవీణ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలో ఓ వ్యక్తి ఆదివారం (జూలై 16) తుపాకీతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి చికోటి ప్రవీణ్ కు చెందిన ప్రైవేటు సెక్యురిటీగా గుర్తించారు. దీనిపై ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు కాగా.. ఈ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌ కేసుతో పాటు ఫోర్జరీ, ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడు A-1గా చికోటి ప్రవీణ్ ను తాజాగా చేర్చారు. A - 2గా సుందర్ నాయక్, A - 3గా రమేష్ గౌడ్, A - 4గా రాకేష్ కుమార్‌లను చేర్చారు.


నిన్న క్రైమ్ నెంబర్ 223/2023 లో సెక్షన్‌లు 420, 467, 468, 471 ఐపీసీ కింద ముగ్గురు వ్యక్తులపై నమోదు చేశారు. నేడు సెక్షన్ లను ఆల్టర్ చేస్తూ 420, 109 ఆర్మ్స్ యాక్ట్ 25, 30 కింద సెక్షన్ లను ఛత్రినాక పోలీసులు మార్చారు. A - 1 చీకోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు చూపించారు. మిగతా ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు గన్ లను స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులు రిమాండ్ కి తరలించారు.


ఆదివారం (జూలై 17) ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాపలా డ్యూటీల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకుని వారిని చెక్ చేయగా, ఆయుధాలు బయటపడ్డాయి. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ కేసులు పెట్టారు.


తుపాకీలకు ఒరిజినల్ పత్రాలు ఉన్నాయి - చికోటి


తమ వద్ద ఉన్న తుపాకీలకు సంబంధించి ఒరిజినల్ లైసెన్స్‌ పత్రాలను చాలా నెలల క్రితమే తాము ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో సమర్పించామని చీకోటి ప్రవీణ్ వివరణ ఇచ్చారు. తనకు ప్రాణ హాని ఉన్నందున ప్రైవేటు సెక్యురిటీతో భద్రత ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. తుపాకీలకు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూపించారని వెల్లడించారు. పత్రాలు మొత్తం పరిశీలించాలని లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని అన్నారు.


ఆ డాక్యుమెట్స్ ఫోర్జరీ అని ఇప్పుడు పోలీసులు అంటుననారని, అవి నకిలీ అంటూ తమపైనే పోర్జరీ కేసు పెట్టారని చికోటి ప్రవీణ్ చెబుతున్నారు. నకిలీ పత్రాలు అయితే తాము పోలీస్ స్టేషన్ కు పంపినప్పుడే ఎందుకు చెప్పలేదని అన్నారు. ఇది పోలీసుల తప్పిదమే అని చికోటి ప్రవీణ్ తప్పు బట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. గజ్వేల్‌ ఘటన తర్వాత తనను టార్గెట్‌ చేశారని చికోటి ప్రవీణ్ విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.