Telangana Latest News: తెలంగాణలో అవినీతి నిరుధక శాఖ ఇటీవల కాలంలో వరుస దాడులు చేస్తోంది. లంచాల రుచిమరిగిన ప్రభుత్వ ఉద్యోగులను వలపన్ని పట్టుకుంటోంది. ఇలా ఏసీబీ దెబ్బకు గత నెలలో భారీగా అవినీతి చేపలు అధికారులకు చిక్కారు. వివిధ శాఖలకు చెందిన 15 మంది ఉద్యోగులను రెడ్‌హ్యాడెండ్‌గా అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది.  

Continues below advertisement


మార్చి నెలలో భారీగా ఏసీబీ కేసులు నమోదు


మార్చి నెలలో అవినీతి నిరోధక శాఖలో జరిగిన దాడులు, వివరాలను ఏసీబీ వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లంచాలు అడిగిన వారి సమాచారం ముందుగా బాధితులు ఇవ్వడంతోనే తమ పని సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. పక్కా సమాచారం అందిన తర్వతా అలాంటి అధికారులను ట్రాప్ చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పేర్కొంది.  గత నెలలో ఇలాంటివి తెలంగాణలో 12 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకోవడమేకాకుండా క్రిమినల్ ప్రవర్తన కలిగిన అధికారులపై 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 


చాలా శాఖల్లో లంచావతారుల


తెలంగాణలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో సహా పదిహేను మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ తనిఖీల్లో రెవెన్యూ, హోం, ఎంఏయూడి, ఇంధనం, విద్య, ఆరోగ్యం, వైద్య, రవాణా, వ్యవసాయం, సహకారం వంటి వివిధ విభాగాల్లో అవినీతి అధికారులు చిక్కారని తెలిపారు. వీళ్ల నుంచి రూ.3లక్షల 28వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ 


జనవరి-మార్చి త్రైమాసికంలో 52 కేసులను ఏసిబి నమోదు చేసిందని, 37 ట్రాప్ కేసులు, 4 అక్రమ ఆస్తుల కేసులు, 4 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 3 రెగ్యులర్ ఎంక్వైరీలు, 1 సర్‌ప్రైజ్ చెక్, 3 డిస్‌క్రీట్ ఎంక్వైరీలు చేసినట్లు ప్రకటనలో వివరించారు. ఆరగురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుతోపాటు, 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ట్రాప్ కేసుల్లో రూ. 12 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ విభాగాల డీఏ కేసులో రూ.4 కోట్ల 80 లక్షల పైగా విలువైన ఆస్తులను వెలికి తీసినట్లు పేర్కొన్నారు.


ఇలా ఏసిబి అధికారుల ప్రకటనతో ప్రభుత్వశాఖలో ఏ స్థాయిలో అవినీతి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. లంచం నేరమని తెలిసినా... లంచగొండి అధికారులపై ఏసిబి డేగకన్ను నిఘా ఉంటుందని తెలిసినా... ఏ మాత్రం జంకులేకుండా బల్లకింద చేతులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవ్వాలంటే, లంచం ఇవ్వాల్సిందేననే వాదనలకు బలం చేకూరేలా ఏసిబి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుని విధులు నిర్వహించే అధికారులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి.


ఎలాంటి లాభాపేక్ష లేకుండా బాధితులకు న్యాయం చేయాలి.కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అలా లేవని స్పష్టంగా అర్దమవుతోంది. శాఖలు ఏవైనా పని జరగాలంటే పైసా ఇవ్వాల్సిందే, కాసులకు కక్కుర్తి పడితేనే కొందరు అధికారులు సమస్య పరిష్కారం కోసం కాలు బయటపెడుతున్నారనే విమర్శలకు తాజాగా ఏసిబి లెక్కలు అద్దం పడుతున్నాయి.