Hyderabad: తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితుల గోడు విన్న బీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. న్యాయపోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పిన నేతలు... లీగర్‌ సెల్ ప్రతినిధుల నెంబర్లు ఇచ్చారు. సమస్యలు వారితో చర్చించాలని సూచించారు. పేదల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం వారి కన్నీళ్లపై అభివృద్ధి కి బాటలు వేస్తోందని ఆరోపించారు. 


హైడ్రా, ఆపరేషన్ మూసి వల్ల నష్టపోయిన బాధితులంతా తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. వారందరి గోడు విన్న బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గోదావరి నీళ్లు మూసీలో పారిస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పేదల కన్నీళ్లు, రక్తం పారిస్తున్నారని హరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదుకానీ పేదలను అరిగోస పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. 




హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న ప్రభుత్వం పెద్దలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు హరీష్‌రావు. వాళ్లకు నోటీసులు ఇచ్చి పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపిస్తున్నారని విమర్శించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్ల పాలన చెల్లదని నినాదాలు చేస్తుంటే తెలంగాణలో బుల్డోజర్ పాలన మాత్రమే సాగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి విధ్వంసం తప్ప వేరే  పని చేయలేదని ఆరోపించారు. 




మూసీ నదిపై పేదల ఇళ్లు కూల్చేసి పెద్దల భవంతులకు అనుమతులు ఇస్తామని చెప్పడం ఇదెక్కడి విడ్డూమని విరుచుకుపడ్డారు హరీష్‌రావు. మూసీ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల జోలికి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెబుతున్నారని ఎంతమందికి ఇస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయని వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుందని నిలదీశారు. అంతే కాకుండా ఇప్పుడ సిటీ మధ్యలో ఉన్న వాళ్లకు సిటీ శివారుల్లో ఇళ్లు కేటాయిస్తే ఇబ్బంది పడతారని తెలిపారు. ఇక్కడ స్కూల్‌, చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు మళ్లీ ఇరవై ముఫ్పై కిలోమీటర్లు దూరం ప్రయాణంచేయాల్సిన పరిస్థితి కల్పిస్తారా అని ప్రశ్నించారు. 


 




ఓవైపు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు, సరైన విద్య లేదు, భోజన వసతి బాగోలేదు. వైద్యం సక్రమంగా లేదన్నారు హరీష్. వీటిని పట్టించుకోని రేవంత్ సర్కారు కేవలం కూల్చడంపైనే ఫోకస్ పెట్టిందని పేదలను హింసిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క పేద, మధ్యతరగతి వ్యక్తిని టచ్ చేయలేదని గుర్తు చేశారు. 


కేవలం రేవంత్  అనాలోచిత నిర్ణయాలు వల్ల హైదరాబాద్‌లో అలజడి రేగిందని ఆరోపించారు హరీష్‌, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఈ లోపు బుల్డోజర్లు తీసుకొచ్చిందన్నారు. వీళ్ల చర్యల వల్ల హైదరాబాద్‌ పేరు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఆపరేషన్ మూసీ సహా అన్నింటిపై చర్చించాలని డిమాండ్ చేశారు హరీష్‌. 




తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులను పరామర్శించిన అనంతరం కుకట్‌పల్లిలో బుచ్చమ్మను పరామర్శించారు. ఆమెది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో కూడా ఇల్లు కూలిపోతుందని తెలిసిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారన్నారు. 


బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని అందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హరీష్‌. తమ లీగల్ టీం ఫోన్‌ తీసుకొని సమస్య ఉంటే ఫోన్ చేయాలని సూచించారు. ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైతే రక్షణగా తమ పార్టీ ఉంటుందని ధీమా కల్పించారు. 


Also Read: జనతా గ్యారేజీలా తెలంగాణ భవన్‌- సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కట్టిన హైడ్రా బాధితులు