Hero Raj Tarun News: తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. హైకోర్టు ధర్మాసనం రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనపై నమోదైన కేసులో ఆయన అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు నుంచి ముందస్తుగా బెయిల్ పొందారు. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆయనపై కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను సహజీవనం చేశామని ఇప్పుడు ఆయన తనను మోసం చేసి పట్టించుకోవడం లేదని లావణ్య ఫిర్యాదు చేసింది. 


సహజీవనం తర్వాత తాము రహస్యంగా వివాహం కూడా చేసుకున్నామని లావణ్య ఆరోపిస్తోంది. తనను వదిలేసి ఇప్పుడు రాజ్ తరుణ్ వేరే మహిళతో తిరుగుతున్నాడని ఆరోపించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌ తరుణ్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు రాజ్ తరుణ్ కు కొన్ని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. రూ.20 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.