KA Paul : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయని లేఖలో అన్నారు.  శుక్రవారం తెల్లవారుజామున సచివాలయంలో మంటలు ఎగసిపడ్డాయి. సెక్రటేరియట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించాయి. ఆరో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. డోమ్‌ల నుంచి దట్టమైన పొగ వెలువడటంతో అగ్నిప్రమాదం విషయం వెలుగుచూసింది. భారీ స్థాయిలో పొగ వ్యాపించడంతో లోపల ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉందనే చర్చ జరుగుతోంది.  మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై కేఏ పాల్ స్పందించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగలేదని విమర్శించారు. నాలుగేళ్లు అయినా ఈ కేసులో నిందితులను తేల్చలేకపోయారని తప్పుబట్టారు. ఒక మాజీ మంత్రిని హత్య చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. 



మీడియాను ఎందుకు అనుమతించడంలేదు 


"సచివాలయంలో అగ్నిప్రమాదంపై కేంద్రానికి, సీబీఐకి లేఖ రాశాను. సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి. ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని అంబేడ్కర్ జయంతి రోజునే ఓపెన్ చేయాలి. లేదా ఇంకా ఏరోజైనా పర్వలేదు. కానీ కేసీఆర్ పుట్టినరోజున ఓపెన్ చేయవద్దు. కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువ. సెక్రటేరియట్ లో ఏం జరుగుతోందో చెప్పాలి. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని కిడ్నాప్ చేశారు. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు ఆయనను కిడ్నాప్ చేశారు. తెలంగాణ బిడ్డల కోసం నేను పోరాటం చేస్తున్నాను. సచివాలయం బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజులు అయింది. అక్కడ ఏం జరిగిందో విచారణ చేయాలి. మీడియాను ఎందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంపై మంత్రులు ఎందుకు స్పందించడంలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఈ విషయంపై ప్రశ్నించడంలేదు. "- కేఏ పాల్ 


అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభించాలి- బండి సంజయ్ 


 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో సచివాలయం ప్రధాన గుమ్మం దగ్గర దట్టంగా పొగలు అలముకున్నాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ స్పందించారు. నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరం అని చెప్పారు. ఆదరా, బాదరా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్నారు. ఫైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.