Minister KTR : ఆడ బిడ్డల చదువు విషయంలో అండగా ఉండేందుకు ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మరో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజినీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన సాయం చేసి ఆమె ఇంజినీరింగ్ పూర్తి అయ్యేలా చూశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటుంది. జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్ ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్  సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో  ఇంజినీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిచి ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన  ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. 


అన్నలా అండగా నిలబడ్డారు 


ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్  ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా సమకూర్చారు. కేటీఆర్ ఆర్థిక సాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో  నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను రుద్ర రచన కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నలా అండగా నిలబడ్డారని, తన కల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనైంది. ఈ సంవత్సరం రాఖీ కట్టాలనుకున్నానని అయితే కేటీఆర్ కాలికి గాయం అయిందన్న విషయం తెలుసుకుని  బాధపడ్డానని రుద్ర రచన చెప్పింది. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో  వెండి రాఖీ తయారుచేయించానన్న రచన , రాఖీని కేటీఆర్ కు కట్టింది. 


భావోద్వేగానికి లోనైన మంత్రి కేటీఆర్ 


రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న ఆమె లక్ష్యానికి అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజినీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలను కోసం అవసరమైన మొత్తం నగదును సోమవారం కేటీఆర్ అందించారు. 


Also Read : KCR BJP Agenda : తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ - కేసీఆర్ నిర్ణయాలు కమలం పార్టీకే మేలు చేస్తున్నాయా ?


Also Read : KCR Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ వెళ్తుండగా రూల్స్ బ్రేక్! మహిళపై చర్యలు - ఘటన మొత్తం రికార్డు