KCR BJP Agenda :  రాజకీయాల్లో  ఆవేశం కన్నా ఆలోచనే కీలకం. అలాంటి రాజకీయ ఆలోచనలు చేయడంలో శిఖరం కేసీఆర్. తెలంగాణ ఉద్యమం నిర్వహించిన తీరే దానికి సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు .. కేసీఆర్ ఓ ఎజెండా సెట్ చేస్తే అన్ని పార్టీలూ పాటించి తీరాల్సిందే. లేకపోతే రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడేది. అలా నడిచిన రాజకీయం ఇప్పుడు రివర్స్‌లో కనిపిస్తోది. ఆయన తనకు తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో పడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. ఇటీవల వరుసగా బీజేపీ కార్యక్రమాలకు  పోటీగా తాను కూడా  చేపడుతూండటమే. 


ఎప్పుడూ లేని తెలంగాణ సమైక్యతా ఉత్సవాలు జరపడంతో చర్చ!


ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేసీఆర్... తాము కూడా కేంద్రం  కంటే ఘనంగా చేస్తామని ప్రకటించారు. మూడు రోజుల పాటు సమైక్యతా ఉత్సవాల పేరుతో నిర్వహించారు. బీజేపీకి ఘనంగా కౌంటర్ ఇచ్చామని అనుకున్నారు. కానీ నిజంగా జరిగింది అదేనా ? . ఉద్యమంలో విమోచన ఉత్సవాల గురంచి భారీగా ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంటయిన కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా జరపడానికి కారణం  తామేనని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమే కదా అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. 


పోటీ స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో మేలు జరిగిందెవరికి ? 
 
 స్వాతంత్ర వజ్రోత్సవాల విషయంలోనూ అదే జరిగింది. కేంద్రం అమృతోత్సవాలను నిర్వహించాలనుకుంటే … కేసీఆర్ సర్కార్ అంత కంటే ఘనంగా నిర్వహించింది. ఇంటింటికి జెండాలను పంపిణీ చేసింది. కార్యక్రమాలను ఘనంగా చేసింది. కానీ అలా చేయడం వల్ల బీజేపీ పేరే ఎక్కువగా ప్రజల్లో చర్చకు వచచింది. బీజేపీకి మేలు చేసేలా స్వతంత్రంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు జరిగాయన్న అభిప్రాయం వినిపించింది. తెలంగాణ ప్రజల్లో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కేంద్రం చేసిందని అనుకునేవారే ఎక్కువ. ఎందుకంటే జాతీయవాదం.., దేశ భక్తి అనే విషయాల్లో బీజేపీ ... తెలంగాణ అంటే  టీఆర్ఎస్ ఎలా గుర్తుకు వస్తుందో అలాంటి ముద్ర వేసేసింది. 


మునుగోడు ఉపఎన్నిక బీజేపీ సెట్ చేసిందే !


మరో వైపు తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపులా మారిన మునుగోడు ఉపఎన్నిక కూడా బీజేపీ సెట్ చేసిందే. ఈ ఉపఎన్నికను అడ్డుకునే అవకాశం.. బీజేపీ వ్యూహాలను చిత్తు చేసే అవకాశం కేసీఆర్‌కు ఉంది. కానీ బీజేపీ అజెండానే ఆయన ఫాలో అయ్యారు. ఉపఎన్నికను ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఉపఎన్నికకు ముందు కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని బీజేపీ రాజకీయాలను చూస్తే అర్థమైపోతుంది వాటికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారు. 


మరికొన్ని విషయాల్లోనూ బీజేపీ అజెండాకే ఫాలో కాక తప్పని పరిస్థితి..!


ఇవే కాదు మరికొన్ని విషయాల్లోనూ బీజేపీ సెట్ చేసిన ఎజెండాను కేసీఆర్ ఫాలో కాక తప్పడంలేదు. పార్లమెంట్‌ బిల్డింగ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డి్మాండ్ చేస్తూ.. సచివాలయానికి అంబేద్కరే పేరు పెట్టి జీవో ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలు దళిత సీఎం  హామీని తెర ముందుకు తెచ్చారు.  ఒకప్పుడు కేసీఆర్ అజెండా సెట్ చేస్తే రాజకీయాలు నడిచేవి. ఆయనకు తెలంగాణ ఉద్యమం అలా కలసి వచ్చింది. కానీ ఇప్పుడు  బీజేపీకి అలాంటిదేమీ లేకపోయినా..  అజెండా చేస్తోంది. కేసీఆర్ నడుస్తున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం ఉందో ముందు ముందు తెలుస్తుంది.