Minister Harish Rao : మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని విమర్శించారు. ఒకటో ఫేజ్ , రెండో ఫేజ్ లో ఇవ్వలేదని, మూడో ఫేజ్ లో ఇస్తామని చివరకు మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను చూపించారన్నారు.  పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం అన్నారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజ్ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయామని చెబుతారన్నారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. 


సొంత నిధుతలతో 12 మెడికల్ కాలేజీ


"కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రం సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు.  ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా ఉండటం వాస్తవం కాదా?  ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?" - మంత్రి హరీశ్ రావు 






రాజ్ భవన్ వాటిపై దృష్టి పెడితే మంచిది


గతంలో బీబీనగర్ ఎయిమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకున్నారన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీ లోని మా పీహెచ్ సీ స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ. 156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారని ప్రశ్నించారు. ఇదే సమయంలో అంటే 2018 లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్ కి 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? అని హరీశ్ రావు నిలదీశారు.  ఈ అన్యాయాల గురించి ఎందుకు ఒక్కరు మాట్లాడరు? ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయరని బీజేపీ తెలంగాణ నేతలపై ప్రశ్నించారు.  ఏపీ పునర్ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ,  రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారు అవుతారన్నారు.