Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ  పాటను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17కు సంబంధించి మూడు కీలక అంశాలను టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదించారు. టీఆర్ఎస్ కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చాడని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెడతామని ప్రతిపాదించారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలిన అవసరముందన్నారు. అలాగే సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సూచనలు చేయాల్సిందిగా పార్టీ నేతలను కోరారు రేవంత్. సెప్టెంబర్ 17తో ఎలాంటి సంబంధం లేని బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్  పేటెంట్ ను బీజేపీ, టీఆర్ఎస్ హైజాక్ చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.  చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్ తనకు అనుకూలంగా కొత్త చరిత్రను రాసుకుంటున్నాడని మండిపడ్డారు.  


మునుగోడులో సమిష్టిగా  


మునుగోడు ఉపఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి 8 యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయింమన్నారు రేవంత్. బూత్ కు ఇద్దరు చొప్పున 300 బూత్ లకు 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోందన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా సెప్టెంబర్ 18 నుంచి అందరూ చిత్తశుద్ధితో కలిసి చేయాల్సిందేనని తెలిపారు. క్షేత్ర స్థాయిలో  టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.


15 రోజుల్లో మూడు సభలు


భారత్ జోడో యాత్ర దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ యాత్రకు  వస్తున్న ఆదరణ చూడలేక బీజేపీ చిల్లర మల్లర ప్రచారానికి దిగుతోందని విమర్శించారు. అక్టోబర్ 24న రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణకు రాబోతోందని, 15 రోజులపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, యాత్రలో భాగంగా మూడు పెద్ద సభలు నిర్వహించాలని భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. ప్రతిపాదనలపై తగిన సూచనలు ఇవ్వాలని పార్టీ నేతలను కోరారు.






Also Read : Bandi Sanjay : విద్యుత్ బిల్లులో మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తా- బండి సంజయ్ సవాల్


Also Read : Telangana Assembly: ఆ సంస్కరణలతో కేంద్రం భయంకర కుట్ర, మీకూ హిట్లర్‌కి పట్టిన గతే - అసెంబ్లీలో కేసీఆర్ ధ్వజం