Students Bike Stunts : హన్మకొండ జిల్లాలో రెండు రోజుల క్రితం బైక్ పై విన్యాసాలు చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ నగర్ మెయిన్ రోడ్ లో అజాగ్రత్తగా, అతివేగంగా, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా బైకుపై విన్యాసాలు చేసిన ముగ్గురు యువకులను హన్మకొండ పోలీసులు  అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోదావరిఖనికి చెందిన ముగ్గురు యువకులు చదువు నిమిత్తం స్థానికంగా హాస్టల్లో ఉంటున్నారు. శనివారం కాజీపేటకు చెందిన తన మిత్రుడి వద్ద కేటీఎమ్ బైక్ తీసుకొని నయీమ్ నగర్ రోడ్డులో విన్యాసాలు చేస్తూ వీడియో తీసుకొన్నారు.  ఇలా బైక్ పై విన్యాసాలు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు హనుమకొండ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అలాగే యువకులు చదువుతున్న కాలేజీ వారికి వీరిపై చర్యల నిమిత్తం సిఫార్సు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజలకు హాని కలిగించే ఏ చర్యలకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఇటువంటి ప్రాణాలకు హాని కలిగించే విన్యాసాలకు పాల్పడి తమ విలువైన  జీవితాన్ని కోల్పోవద్దని హెచ్చరించారు.  


ప్రాణాలతో చెలగాటం 


 ఇటీవల కాలంలో బైక్ రేస్ లు, స్టంట్స్ చేయడం పెరిగింది. మార్కెట్ లో వస్తున్న కొత్త రకం బైక్ లతో విన్యాసాలు చేస్తూ యువత తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌ స్టంట్స్ చేయడం అంటే ఎంతో శిక్షణ, తగిన జాగ్రత్తలు ఉండాలి. అలా కాకుండా  యువత రోడ్లపై ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ  స్టంట్స్ చేస్తున్నారు.  అయితే ఎటువంటి సాధన చేయకుండా, శిక్షణ తీసుకోకుండా విన్యాసాలు చేస్తూ కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. కదులుతున్న బైక్ మీద విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. బైక్‌ చేతిలో ఉంటే చాలు, బైక్‌పై నిలబడి నడపడం, బైక్‌ స్పీడ్‌ పెంచి ఇతరులకు ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. బైక్‌ స్టంట్‌ చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది తెలిసి కూడా యువకులు  సినిమా స్టైల్లో బైక్‌ స్టంట్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. అంతే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీసిన సందర్భాలు లేకపోలేదు. 


తోటి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు
 
హైదరాబాద్‌ లో  ఇలాంటి ఆగడాలు రోజురోజుకు విపరీతం అవుతున్నాయి. అర్ధరాత్రుళ్లు బైక్ పై స్టంట్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్నారు కొందరు. మలక్ పేట్, చంచల్ గూడ రోడ్లపై బైక్ లతో స్టంట్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. విద్యార్థులు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోకిరిల స్టంట్స్ తో ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా అధిక సౌండ్‌ లు చేసే సైలెన్సర్లు వినియోగిస్తూ ధ్వని కాలుష్యం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తెస్తున్నారు. పోకిరిల చేష్ఠలకు అడ్డుకుట్టవేయాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు. బైక్ స్టంట్స్ పై నిఘా పెట్టి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.