Godavari Water To Kaveri From Ichchampally: గోదావరి (Godavari River)- కావేరి (Cauvery River) నదుల అనుసంధానంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ (Telanagana) ప్రాంతంలోని ఇచ్చంపల్లి (Icchampally Project) వద్ద నుంచే నీటిని తీసుకునేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, భూ సేకరణ, పరిహారం, బెడ్తి-వార్ధా నదుల అనుసంధానికి రూపొందించిన ముసాయిదా ఒప్పందంపై చర్చించడానికి సంబంధిత రాష్ట్రాలతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(National Water Development Agency) శుక్రవారం అయిదో సంప్రదింపుల సమావేశం నిర్వహించనుంది. దీనితో పాటుగా నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరగనుంది. 


రాష్ట్రాల ఆమోదం అవసరం
హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశాలు జరుగనున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌ హాజరుకానున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి పాల్గొంటున్నాయి. గోదావరి - కావేరి అనుసంధానంతో 147.93 టీఎంసీలు, కృష్ణా నదికి ఉప నదులైన బెడ్తి- వార్థాల అనుసంధానంతో 18.50 టీఎంసీల మళ్లింపు మొత్తం కలిపి 166.43 టీఎంసీల మళ్లింపుపై రాష్ట్రాల అభిప్రాయం, ఆమోదాన్ని తీసుకోనున్నారు.


ఇచ్చంపల్లి వద్దే నీటి తరలింపు
గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా సమ్మక్క సాగర్‌ను కేంద్రం ఇప్పటికే పలుమార్లు పరిశీలించింది. అయితే చివరకు ఇచ్చంపల్లిని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని జలాలను తరలించేందుకు నిర్ణయించింది.  గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌, సోమశిల, కావేరీ పరీవాహకానికి తరలించాలని నిర్ణయించింది. ఈ అంశాలపై రాష్ట్రాలు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.


రాష్ట్రాలకు వాటా
కేంద్రం వాటిని పట్టించుకోలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసి ముసాయిదా ఒప్పందాన్ని సిద్ధం చేసింది. గోదావరి నుంచి 147.93 టీఎంసీల నీటిని తరలించడంతో పాటు మార్గం మధ్యలో ఉన్న రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు పొందే నీటి కోటాకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఖర్చును భరించాలని కేంద్రం సూచించింది. బెడ్తి-వార్ధాలో భాగంగా కర్ణాటకలో 1.04 లక్షల హెక్టార్లు కొత్తగా సాగులోకి తేనున్నారు. తాగునీటితో పాటు మొత్తం 5.73 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాలని నిర్ణయించింది.


ఏడు రాష్ట్రాల సీఎంల అంగీకారం అవసరం 
నదుల అనుసంధానానికి సంబంధించి రెండు లింక్‌లతో కలిపి 6.78 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు, 28.25 టీఎంసీల తాగునీరు, 31.04 టీఎంసీలను పరిశ్రమల అవసరాలకు నీటిని కేటాయించనున్నారు. ఇందులో భాగంగా 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం సీఎంలతో ఒప్పందంపై సంతకాలు తీసుకుని ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఈ నెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డ్రాఫ్ట్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.


ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య గోదావరి జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖను ఏపీ కోరింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-3ను అనుసరించి గోదావరి జలాల పంపిణీ చేపట్టాలంది. అలాగే కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను పునస్సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని ఫిర్యాదు చేసింది. 


మేడిగడ్డకు మరమ్మతు పనులు
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ పరిధిలో కుండిపోయిన పియర్ల వద్ద ఇంజినీరింగ్‌ అధికారులు, ఎల్‌అండ్‌టీ సంస్థ నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. నీటి మళ్లింపు, నది గర్భంలో కాఫర్‌ డ్యాం కోసం యంత్రాలు, సామగ్రి, కార్మికులను తరలించేందుకు వీలుగా మట్టి పనులు చేపడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఎత్తి నీటి నిల్వను తగ్గించారు. అయితే అన్నారం బ్యారేజీలో నీటి బుడగలు ఏర్పడటంతో అక్కడ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీలో ప్రవాహం 19,720 క్యూసెక్కుల నుంచి 48,160 కూసెక్కులకు పెరిగింది.