KTR Comments on Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తరువాతి స్టెప్ బీజేపీలో చేరడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టీంతో కలిసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎందుకు భయమో రేవంత్ రెడ్డి ఇటీవల అందుకు కారణాలు చెప్పాడంటూ మరో బాంబు పేల్చారు కేటీఆర్. 


బీజేపీలో మొదలై.. కాషాయంతోనే ముగింపు


‘తన రాజకీయం పుట్టింది బీజేపీలో. చివరికి తన రాజకీయ ప్రస్థానం ముగిసేది బీజేపీలోనే అని ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాషాయ జెండా కప్పుకుని ఏబీవీపీలో రేవంత్ ప్రస్థానం మొదలైందని, చివరికి బీజేపీలో చేరి కాషాయ జెండా కప్పుకుని చనిపోతానని ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా ? కాదా ! అని’ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఈ మాటల్ని ఇటీవల తన సన్నిహితుల వద్ద బయటపెట్టారని
 కేటీఆర్‌ అన్నారు. రేవంత్ త్వరలోనే తన టీంతో కలిసి వెళ్లి బీజేపీలో చేరడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని.. రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థుల్లా నటిస్తూ, ఢిల్లీకి వెళ్తే స్నేహితుల్లా ఉంటారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. బీజేపీకి బీ టీమ్ ఎవరు అనే దానిపై కొన్నేళ్లుగా తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీకి బీ టీమ్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పదే పదే వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అని రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారినా బీ టీమ్ గొడవ కొనసాగుతోంది. రైతు రుణమాఫీ చేశామని చెప్పి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు రైతుల్ని నట్టేట ముంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిపై చర్చకు ఎక్కడైనా తాము సిద్ధమేనని రేవంత్ కు సవాల్ సైతం విసిరారు.


ఎన్నికల తరువాత కొత్త వివాదం ఏంటంటే.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం చేయకపోయినా.. మోదీని బడే భాయ్ అని రేవంత్ పిలవడానికి కారణం అదేనంటూ విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లోనూ రాష్ట్రానికి నిధులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. అదే బీఆర్ఎస్ కనుక అధికారంలో ఉండి ఉంటే, రాష్ట్రానికి నిధులు తెచ్చేదన్నారు. కేంద్రంతో పోరాడటం కాదు, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. త్వరలో రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి వెళ్లి కాషాయ పార్టీలో చేరడం కన్ఫామ్ అని, కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.


Also Read: Telangana: ఏ సెంటర్‌లోనైనా చర్చకు వస్తావా- రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- రుణమాఫీపై రాజుకున్న రాజకీయం