Revanth Reddy Vs Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ మొదలైంది. రుణమాఫీ చేశాం హరీష్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శుక్రవారం ఫ్లెక్సీలు వేసింది. ఇప్పుుడు పోటీగా బీఆర్‌ఎస్ కూడా ఫ్లెక్సీలు వేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఫ్లెక్సీలతో విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. 


పంచపాడవుల కథలా తెలంగాణలో రుణమాఫీ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం 14 వేల కోట్లు కోత పెట్టిందని ఆరోపించారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. 


రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు హరీష్‌. కొన్ని ప్రాంతాల్లో వేలల్లో రుణగ్రహీతలు ఉంటే  వందల మందికే రుణమాఫీ అయిందని చూపించారు. తన నియోజకవర్గంలోనే చాలా పల్లెలు ఇలాంటివి ఉన్నాయన్నారు. 
తెలంగాణ భవన్‌లో కాల్ సెంటర్‌ పెడితే తమకు లక్షమందికిపైగా తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్లు చేసి చెప్పారన్నారు హరీష్‌రావు. ఇలా జరగని రుణమాఫీ గురించి రేవంత్‌ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నావని అన్నారు.తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని... ఎవరి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. 


తాను ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే పదవి వదులుకోవడానికి ఆరోజు గన్ పార్క్ వద్ద చెప్పానని ఇప్పుడు అదే చెబుతున్నానని అన్నారు. అనుకున్నట్టుగానే రుణమాఫీ ప్రభుత్వం చేయలేదన్నారు. అధికారం కోసం అనాడు వెళ్లి లోన్లు తెచ్చుకోమని ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. 


 


జిల్లాల్లో ధర్నాలు


జిల్లాల్లో కూడా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో రుణమాఫీ కాలేదని రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్దేశించిన గడువులోగా తాము పంట రుణాలు తీసుకున్నామని, తమకు 2 లక్షలలోపు రుణాలు తీసుకున్నప్పటికీ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రుణాలు మాఫీ చేయాలని ఏఈఓ ప్రశాంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.






జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రుణమాఫీ జరగలేదని కెనరా బ్యాంక్ ముందు రైతుల ధర్నా చేశారు.






సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు రైతులు.