తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ప్రశాంతంగా  వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్లకు పోలింగ్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే ఇప్పటివరకూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఈసారి వృద్ధులు, దివ్యాంగులు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.


వీరే అర్హులు


రానున్న ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులతో పాటు తాజాగా 13 రకాల అత్యవసర సేవల సిబ్బందికి సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. వీరందరూ ఇంటి వద్దే ఓటెయ్యొచ్చు. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం 5 విభాగాల వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటెయ్యొచ్చు. వీరు తగిన ధ్రువ పత్రాలతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి (RO) దరఖాస్తు చేసుకోవాలి.



  • సర్వీసు ఓటర్లు అంటే సైన్యంలో పని చేసే ఉద్యోగులు, ప్రత్యేక ఓటర్లు అంటే రాష్ట్రపతి, ఇతరత్రా కార్యాలయాల్లో పని చేసే స్థానికులు

  • పీడీ యాక్టు కింద అరెస్టైన వారు, ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు, సిబ్బంది

  • నోటిఫైడ్ ఓటర్లుగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి మించి వైకల్యం కలిగిన 21 రకాల దివ్యాంగులు ఉన్నారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. 


వీరి ఇళ్లకు బీఎల్ఓలు వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఇష్టపడే వారికి ఫారం - 12డీ ఇస్తారు. అయితే, ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఆర్వో ఆమోదం తెలిపితే, సంబంధిత ఓటరు ఇక పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది.


పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఇలా


పోలింగ్ కు ముందు, ఏవేని 2 తేదీల్లో తపాలా ఓటు వేసేందుకు ఆర్వో అవకాశమిస్తారు. అనుకూలమైన రోజును ఓటరు ఎంచుకోవచ్చు. రాజకీయ పార్టీలకు ఆయా తేదీలు, సమయం, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు చేరతాయి. అవసరం అనుకుంటే ఏజెంట్లు కూడా రావొచ్చు. ఈ తతంగాన్నంతా వీడియోలో చిత్రీకరిస్తారు. ఓటరు ఇంట్లోనే పోలింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఎవరికీ కనిపించకుండా ఓటరు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశాక ఆ బ్యాలెట్ పేపర్ ను చిన్నపాటి కవరు(ఫారం - 13సీ)లో ఉంచి సీల్ వేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఓటు వేసినట్లు ధ్రువీకరణ పత్రం (ఫారం - 13ఏ)పై ఓటరు సంతకం చేయాలి. ఈ రెండింటినీ ఎన్నికల అధికారి మరో కవరులో (ఫారం - 13సీ) పెట్టి ఓటరు సమక్షంలోనే సీల్ చేస్తారు. ఇలా సేకరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాయంత్రం రిటర్నింగ్ అధికారికి చేరుతాయి.


నోటిఫైడ్ ఓటర్ల జాబితా విస్తరణ


ఎన్నికల సంఘం ఈసారి నోటిఫైడ్ ఓటర్ల జాబితాను తాజాగా విస్తరించింది. ఈ జాబితాలో ఎన్నికల విధుల కారణంగా ఓటు వేయలేకపోయే అత్యవసర సేవల ఉద్యోగులకు తాజాగా స్థానం కల్పించింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల టైంలో దేశంలోనే తొలిసారిగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), ఆల్ ఇండియా రేడియో (AIR), BSNL, భారతీయ రైల్వే, ఆర్టీసీ, విద్యుత్, ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం, ఆహారం, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖలు, కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించే జర్నలిస్టులను ఈ విభాగంలో చేర్చారు. ఆయా సంస్థలు రిటర్నింగ్ అధికారుల ద్వారా ఉద్యోగులకు ఫారం - 12డీ ఇప్పింది, పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పించొచ్చని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.