CM KCR Comments: దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీ బాయి జయంతిని ( డిసెంబరు 1 )  పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజిక వేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీబాయి అనుసరించిన విలువలు, రేపటి తరానికి స్పూర్తిని అందించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగారని అన్నారు. 






ప్రజాస్వామిక వాదుల స్పూర్తితో అనేక పథకాలు..


గత పాలకులు ఈశ్వరీ బాయి జయంతిని విస్మరించారని.. కానీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈశ్వరీ బాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో, తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని సీఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ఈశ్వరీబాయి వంటి దళిత ప్రజాస్వామిక వాదుల స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. దళితుల ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా, వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించే దిశగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 






125 అడుగులతో దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం..


దళిత బహుజన, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించాలనే స్పృహను యావత్ దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే  తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. 125 అడుగులతో దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదన్నారు.