Choutuppal: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నించి, వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను స్థానిక టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి దహనం చేశారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సైనికలను డబ్బులతో కొనలేరని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, మోసాలను దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని అందుకే.. బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహరాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూల్చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండి పడ్డారు. 



నలుగురు ఎమ్మెల్యేలను కొని ఏదో చేద్దామనుకున్నారు..


తమ కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా రాజకీయ వికృత చర్యలకు పాల్పడుతున్న బీజేపీని దేశ వ్యాప్తంగా ప్రజలు చీత్కరిస్తున్నారని మంత్రి వేముల అన్నారు. మోడీ, అమిత్ షా భారత దేశం వారి జాగీర్ అయినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే, దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారని అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. 


"బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు... ఇది కేసిఆర్ అడ్డా"


ఇతర రాష్ట్రాల్లో ఎక్నాథ్ షిండేలను తయారు చేసి ప్రభుత్వాలను కూల దోసినట్టు తెలంగాణలో చేస్తామంటే ఊరుకోబమని స్పష్టం చేశారు. "బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు... ఇది కేసిఆర్ అడ్డా" అంటూ కామెంట్లు చేశారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి లాగా.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని అన్నారు. మా ఎమ్మెల్యేలకు ఒక్కరికి వెయ్యి కోట్లు ఇచ్చిన అమ్ముడుపోరని వాళ్లు.. నిఖార్సైన తెలంగాణ బిడ్డలు, కేసిఆర్ సైనికులనీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్ట బయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారన్నారు. గుజరాత్ బానిస బండి సంజయ్.. సిగ్గు లేకుండా సమర్డించుకుంటున్నాడని గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలతో సహా నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగలు బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేముల హెచ్చరించారు. ఎవరు ఎన్ని చేసినా మునుగోడులో గెలవబోయేది టీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు.