తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నాయని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలను అన్ని విధాలుగా అణచివేశారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. 'బీసీ వ్యక్తి సీఎం అయ్యేది లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు' అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవహేళన చేశారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఒక్క కమిషన్ కూడా వేయని కాంగ్రెస్ ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చెప్పగలవా.? అంటూ నిలదీశారు.


'ఏకైక పార్టీ బీజేపీ'


బీసీల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీల సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని, బీజేపీ ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 31 మంది బీసీలకు టికెట్లు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7న బీసీ ఆత్మ గౌరవ సభ, 11న ఎస్సీ వర్గీకరణపై సభ ఉంటుందని వివరించారు. ప్రధాని మోదీ ఈ సభలకు హాజరవుతారని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


ప్రధాని మోదీ పర్యటన ఖరారు


తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ 7న రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వచ్చి, 5:30 నుంచి 6:10 వరకూ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభ ముగించుకుని 06:35కు తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, దాదాపు లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ ప్రతినిధుల బృందం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.


Also Read: Telangana Elections 2023 : కాళేశ్వరం అవినీతిపై 15 నిమిషాల్లో సీబీఐ విచారణ - ఒక్క షరతు పెట్టిన కిషన్ రెడ్డి !