Telangana Elections 2023 :  మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగుబాటుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పిల్లర్ల కుంగడంతో బ్యారేజ్ ఉంటుందా.. మొత్తానికే కొట్టుకపోతుందనే ఆందోళ ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బీజేపీ ప్రతినిధుల బృందం శనివారం పరిశీలించింది. కిషన్ రెడ్డి నేతత్వంలో మేడి గడ్డ బ్యారేజీని బీజేపీ నేతలు పరిశీలించారు. కుంగిన పిల్లర్లను డా. లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరాన్ని పరిశీలించిందన్నారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చిందన్నారు.                 

  


కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి దోపిడి                                           


నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక అంశాలను పొందుపర్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కాళేశ్వరం నిర్మాణం చేసిందన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి రూ.40వేల కోట్లు అంచనా వేశారన్నారు. అంచనాను రూ. 1.30 లక్షల కోట్లకు పెంచారన్నారు. కాళేశ్వరంపై తెలంగాణ సమాజం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఇంజనీర్ల నోరు మూయించి కేసీఆరే ఇంజనీర్ గా వ్యవహరించారన్నారు. కేసీఆర్ ఉత్తరం రాస్తే 15 నిమిషాల్లో సీబీఐ విచారణ చేస్తుందన్నారు. 


కేంద్రానికి  పూర్తి సమాచారం ఇవ్వని  తెలంగాణ                 


 అధికారులు 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వివరాలు అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించి మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా.. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా నిలిచిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు దుర్వినియోగం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. రూ. లక్ష కోట్ల అప్పులు చేసిన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు.  


కేసీఆర్ లేఖ రాస్తే సీబీఐ విచారణ                        


కేసీఆర్ అవినీతితో మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు ఏర్పాడి పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు.   సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి,నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణచడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ లేఖ రాయాలని చెబుతోంది.