విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్న ఢిల్లీ విద్యావిధానం బాగుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు.   ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తామని.. మా రాష్ట్రం నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కేసీఆర్ తెలిపారు. కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో ఆయన పర్యటించారు. దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు.  ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసికేసీఆర్‌ చూశారు. 



పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సీఎంలు ఇద్దరు గ్రూప్‌ ఫొటో దిగారు.ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు.ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇందు కోసం తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని, ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయం చేయాలని చెప్పామన్నారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు.



పాఠశాల పనితీరు, కాన్సెప్ట్‌ బాగుందని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అఖిలేష్‌, కేజ్రీవాల్‌తో భేటీపై ప్రస్తావించారు. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని, పవిత్రస్థలంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దన్న కేసీఆర్‌.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతామన్నారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని, ఆ సంచలనం జరిగి తీరుతుందని చెప్పారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారన్నారు. అనంతరం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ మహమ్మద్‌పూర్‌ మొహల్లా క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు.