Amrut Mission: అమృత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.832.60 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. రాజ్యసభలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు అమృత్ మిషన్ కింద రూ.1663 కోట్ల విలువైన 66 ప్రాజెక్టుల పనులు మెదలు కాగా.. రూ.1543 కోట్ల విలువైన 60 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇందులో రూ.1310 కోట్ల విలువైన 26 తాగునీటి సరఫరా ప్రాజెక్టులు, రూ.203 కోట్ల విలువైన 4 మురుగు నీటి నిర్వహణ ప్రాజెక్టులు, రూ.30 కోట్ల విలువైన పార్కులు ఉన్నాయని చెప్పారు. అలాగే రూ.114 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టు, రూ.6 కోట్ల విలువైన పార్కుల అభివృద్ధి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.


పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల 50 వేల 84 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 2 లక్షల 23 వేల 361 నిర్మాణాలు పూర్తి అయినట్లు వివరించారు. ఒక్క హైదరాబాద్ కే లక్షా 52 వేల 511 మంజూరు చేయగా.. లక్షా 40 వేల 865 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. వివిధ ప్రాంతాల్లో 27 వేల 858 ఇళ్లు నిర్మించినట్లు స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద గ్రేటర్ వరంగల్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.412 కోట్లు కేటాయించగా రూ.345.31 కోట్లు వినియోగించుకున్నట్లు తెలిపారు. 


ఉడాన్ స్కీం కింద నాగార్జున సాగర్ లో ఏరో డ్రోమ్ అభివృద్ధి చేయడానికి 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యత రాష్ట్ర సర్కారుదే అని చెప్పారు. ఆదిలాబాద్, ఆలేరు, కాగజ్ నగర్ ఎయిర్ పోర్టులు ఉడాన్ స్కీం కింద అన్ సర్వ్డ్ విమానాశ్రయాల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. సీఎం కృషి సంచార యోజన - సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద 2016లో తెలంగాణ నుంచి 5.7 లక్షల హెక్టార్లకు నీరందించే సామర్థ్యం ఉన్న 11 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను చేర్చినట్లు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటికే 4.1 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పించినట్లు వివరించారు. 


 తెలంగాణకు 3 లక్షల 66 వేల 306 కోట్ల అప్పు


తెలంగాణకు 2019 మార్చి నాటికి లక్షా 90 వేల 203 కోట్లుగా ఉన్న అప్పు 2023 మార్చి నాటికి 3 లక్షల 66 వేల 306 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్ సభలో ఎంపీ నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. రాష్ట్ర సర్కారు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ పేరుతో రూ.1407.97 కోట్లు, తెలంగామ హార్టీకల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో 526.26 కోట్లు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో రూ.6258.95 కోట్లు, క్రెడిక్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి టీఎస్సీఎస్సీ ఎస్ఎల్ రూ.15,643 కోట్లు, టీఎస్ మార్క్ ఫెడ్ 483 కోట్లు, రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి 4 వేల 263 కోట్లు, వేర్ హౌసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 66.54 కోట్లు అప్పులు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.