Land allotted to BRS MP Parthasaradhi Reddy was canceled :  బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం  గట్టి షాక్ ఇచ్చింది. హెటెరో సంస్థల అధిపతిగా ఉన్న ఆయనకు ఆస్పత్రి నిర్మాణానికి అంటూ పదిహేను ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని 30 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కేటాయించింది. ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా జారీ చేసిన జీవో ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఇది రెండో సారి ఈ భూమి కేటాయించడం . అంతకు ముందు ఓ సారి కేటాయిస్తే  హైకోర్టు రద్దు  చేసింది. 
 


తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయించింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది.    అయితే, సాయి సింధు ఫౌండేషన్ కి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ రైట్ టు సొసైటీ సభ్యులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది. భూకేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది.  ప్రభుత్వం 60ఏళ్లకు భూమిని లీజుకి ఇచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం 60ఏళ్లకు అద్దె విలువ కోటి 47లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అయితే, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంత తక్కువకు అద్దెకు ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5వేల 344 కోట్ల గండి పడుతుందని తెలిపింది. ఇంత ఖరీదైన భూమిని ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు రద్దు చేయడంతో.. ఎన్నికలకు ముందు మరోసారి సీక్రెట్ గా భూమిని కేటాయించారు. 


అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. 2023 సెప్టెంబరు 25న జీవో-140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10ు మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీవో-140లో స్పష్టం చేసింది. ఇప్పుడీ భూమి కేటాయింపును రేవంత్ సర్కార్ రద్దు చేసింది.