మనదేశంలో ప్లేస్టేషన్ 5 స్టాక్ మళ్లీ అందుబాటులోకి రానుంది. అంటే సేల్ మళ్లీ జరుగుతుందన్న మాట. అక్టోబర్ 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనికి సంబంధించిన సేల్ జరుగుతుందని సోనీ పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఇవి మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇవి మొట్ట మొదటి సారి ప్రీ-ఆర్డర్లకు వచ్చినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. తర్వాత ఎన్నిసార్లు సేల్‌కి వచ్చినా వెంటనే స్టాక్ అవుట్ సమస్య వచ్చేది. వినియోగదారులకు ఈ గేమింగ్ కన్సోల్‌పై ఉన్న క్రేజ్ అలాంటిది మరి.


సోనీ సెంటర్, గేమ్స్ ది షాప్ మాత్రమే ఇప్పుడు ప్రకటన ఇచ్చాయి. కాబట్టి వీటి సేల్ ఇందులో మాత్రమే జరిగే అవకాశం ఉంది. సేల్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఇవి మిగతా ప్లా‌ట్‌ఫాంల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆసక్తి గల వినియోగదారులకు ఇప్పుడు మళ్లీ వీటిని కొనుగోలు చేసేందుకు అవకాశం లభించింది. సోనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Shopatsc.com వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.


ప్లేస్టేషన్ 5 ధర మనదేశంలో రూ.49,990గా ఉంది. ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధరను రూ.39,990గా నిర్ణయించారు. అమెరికాలో పీఎస్5 ధర 499.99 డాలర్లుగానూ(సుమారు రూ.36,700), పీఎస్5 డిజిటల్ ఎడిషన్ ధరను 399.99 డాలర్లుగానూ(సుమారు రూ.29,400) ఉంది. యాపిల్ తరహాలోనే పీఎస్5 ధర కూడా అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా ఉంది.


వీటికి సంబంధించిన డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ ధరను రూ.5,990గానూ, హెచ్‌డీ కెమెరా ధరను రూ.5,190గానూ, పల్స్ 3డీ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధరను రూ.2,590గానూ నిర్ణయించారు. దీని ద్వారా గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఇక డ్యూయల్ సెన్స్ చార్జింగ్ స్టేషన్ ధర రూ.2,590గా ఉంది. అయితే కన్సోల్ కొన్న వారికి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది.


సోనీ ప్లేస్టేషన్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్ సిరీస్‌లో కొన్ని గేమింగ్ కన్సోల్స్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర రూ.34,990గానూ, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ రూ.49,990గానూ ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?