యాపిల్ తర్వాతి తరం ఐఫోన్ 15 నిరంతరం వార్తల్లో ఉంటూ వస్తుంది. త్వరలో రానున్న ఐఫోన్ 15 ప్రోలో యాపిల్ ఏ17 బయోనిక్ చిప్‌ను అందించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిప్ ద్వారా స్మార్ట్ ఫోన్ మరింత వేగంగా పని చేయనుంది. జీపీయూ పనితీరులో కూడా మెరుగుదల కనిపిస్తుందని యూజర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 3ఎన్ఎం ప్రాసెసర్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చని కూడా వార్తలు ఉన్నాయి.


మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏ17 చిప్ గరిష్టంగా 3.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్‌ను అందించనుందని తెలుస్తోంది. Unknownz21 (@URedditor) పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా ప్రకారం ఏ17 బయోనిక్ ప్రాసెసర్ చిప్‌కి సంబంధించిన సమాచారం లీక్ అయిందని లైవ్ మింట్ కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో సిరీస్‌లో ఏ16 బయోనిక్ చిప్‌ను అందించారు.


ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ల్లో యాపిల్ 8 జీబీ ర్యామ్‌ను అందిస్తారని భావించారు. ఈ టిప్‌స్టర్ ప్రకారం ఐఫోన్ 15 ప్రో వేరియంట్ దాని మునుపటి వెర్షన్ లాగా 6జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుందని తెలుస్తోంది. యాపిల్ ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌ను టీఎస్ఎంసీ రూపొందించనుంది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12వ తేదీ లేదా సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది.


లీక్ అయిన వార్తల ప్రకారం కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) కోసం ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


ఐఫోన్ ఎస్ఈ 4 స్మార్ట్ ఫోన్ కూడా ఎంతో కాలం నుంచి వార్తల్లో ఉంది. ఐఫోన్ 14 తరహా డిజైన్‌తో కొత్త బడ్జెట్ ఐఫోన్ రానుందని తెలుస్తోంది. మొదట యాపిల్ ఈ ఫోన్‌ను 2024లో లాంచ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ కొత్త జనరేషన్ మోడల్ లాంచ్ 2025కు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ డిజైన్ ఐఫోన్ ఎక్స్ఆర్ తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఆల్ స్క్రీన్ తరహా డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారు. ఐఫోన్ ఎస్ఈ మూడో తరం ఫోన్ 2022 మార్చిలో లాంచ్ అయింది.


ఐఫోన్ 14, ఐఫోన్ ఎక్స్ఆర్ తరహా డిజైన్‌లో ఐఫోన్ ఎస్ఈ 4 కూడా లాంచ్ కానుందని యాపిల్ గతంలోనే తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుందని సమాచారం. దీని అంచులు చాలా ఫ్లాట్‌గా ఉండనున్నాయి. ఫేస్ ఐడీని కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ సిరీస్ తరహా లాంచ్ టైమ్ లైన్‌ను ఐఫోన్ ఎస్ఈ సిరీస్ లాంచ్ ఫాలో అవ్వవు. ఇవి మార్చి, ఏప్రిల్ తరహాలో లాంచ్ అవుతాయి. యాపిల్ ఎస్ఈ డివైసెస్‌ను కంపెనీ రెండేళ్లకు ఒకసారి మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ఇప్పటివరకు యాపిల్ మొత్తంగా మూడు ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌ను లాంచ్ చేసింది.


మొట్టమొదటి ఐఫోన్ ఎస్ఈ 2016లో లాంచ్ అయింది. ఆ తర్వాత రెండో జనరేషన్ మోడల్ 2020లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో జనరేషన్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2022) మొబైల్‌ను 2022 మార్చిలో కంపెనీ లాంచ్ చేసింది. ఈ మోడల్‌లో ప్రారంభ వేరియంట్ అయిన 64 జీబీ మోడల్ ధరను రూ.43,900గా నిర్ణయించారు.


Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial