టీ20 వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్ విజయంతో ప్రారంభించింది. వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే మొదటి విజయం కావడం విశేషం. ఇంతకుముందు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీసే విజయం సాధించింది. ఇప్పుడు ఆ వరుస విజయాల రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది.


రెండో ఓవర్ నుంచి టపటపా..
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే వెస్టిండీస్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించిన ఎవిన్ లూయిస్‌ను(6) క్రిస్ వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో లెండిల్ సిమ్మన్స్(3), ఐదో ఓవర్లో షిమ్రన్ హెట్‌మేయర్(9), ఆరో ఓవర్లో క్రిస్ గేల్(13) కూడా అవుట్ కావడంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో డ్వేన్ బ్రేవోను(5) క్రిస్ జోర్డాన్ అవుట్ చేయగా.. తొమ్మిదో ఓవర్లో నికోలస్ పూరన్‌ను(1) టైమల్ మిల్స్ పెవిలియన్ దారి పట్టించాడు. 10 ఓవర్లలో వెస్టిండీస్ ఆరు వికెట్లు నష్టపోయి 44 పరుగులు మాత్రమే చేసింది.


వెస్టిండీస్ చివరి నాలుగు వికెట్లను క్రిస్ జోర్డానే తీశాడు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ రసెల్‌ను(0) అవుట్ చేసిన జోర్డాన్, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో కీరన్ పొలార్డ్(6), ఓబెడ్ మెక్‌కాయ్‌ని(0), మూడో ఓవర్లో రవి రాంపాల్‌ని(3) అవుట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు తెర పడింది. 14.2 ఓవర్లలో 55 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ అయింది. క్రిస్ గేల్ తప్ప వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మొయిన్ అలీ, టైమల్ మిల్స్ రెండేసి వికెట్లు తీశారు. క్రిస్ గేల్, జోర్డాన్‌లకు చెరో వికెట్ దక్కింది. బౌలింగ్ వేసిన ఇంగ్లండ్ బౌలర్లందరూ వికెట్లు తీయగలిగారు.


8 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ..
స్వల్ప లక్ష్యమే అయినా ఇంగ్లండ్ కూడా నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సింది 56 పరుగులు మాత్రమే కావడంతో.. ఎక్కడా ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితి రాలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జేసన్ రాయ్(11), ఐదో ఓవర్లో జానీ బెయిర్ స్టో(9), ఆరో ఓవర్లో మొయిన్ అలీ(3), ఏడో ఓవర్లో లియామ్ లివింగ్ స్టోన్(1) అవుటయ్యారు.


అయినప్పటికీ ఒక ఎండ్‌లో జోస్ బట్లర్ (24 నాటౌట్: 22 బంతుల్లో, మూడు ఫోర్లు) జాగ్రత్తగా ఆడటంతో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అకియల్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా.. రవి రాంపాల్‌కు ఒక వికెట్ దక్కింది. వెస్టిండీస్ కనీసం 100 పరుగులు చేసినా ఇంగ్లండ్‌కు లక్ష్యఛేదన కష్టం అయ్యేది.


Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి