PV Sindhu Success Story: 'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస'.. అనే సామెత మనం వినుంటాం. ఈ నానుడికి నిలువెత్తు నిద‌ర్శ‌నం పూస‌ర్ల‌ వెంక‌ట సింధు.. మ‌న తెలుగ‌మ్మాయి. ఆమె సాధించిన విజ‌యాలు కేవ‌లం వ్య‌క్తిగ‌తంగా మాత్ర‌మే కాదు చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ క్ష‌ణాలు. బ్యాడ్మింట‌న్ రాకెట్ ప‌ట్టిన 8వ ఏట‌నే ఏ త‌ప‌న ఉందో ఇప్ప‌టికీ అదే త‌ప‌న సింధులో ఉంది. క‌ష్ట‌మైన ఒలింపిక్ ప‌త‌కం సాధించాల‌న్న‌ లక్ష్యాన్ని చేరే వ‌ర‌కూ త‌న‌కిష్ట‌మైన ఐస్‌క్రీం వ‌దులుకొంద‌ని తెలిసి సాక్షాత్తూ దేశ ప్ర‌ధాని మోదీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విందులో ఆమెతో ఐస్ క్రీం తిన్నారు. అస‌లు సింధు ఎలా ఇన్ని రికార్డులు సాధించారు. ప్ర‌పంచ మ‌హిళా లోకానికి ఎలా స్పూర్తిగా నిల‌బ‌డ్డారు? క‌ఠిన స‌వాళ్లలో ఎలా నిలిచి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారో ఓసారి చూస్తే..


పి.వి. సింధు.. 1995 జులై 5న హైద్రాబాద్ లో జ‌న్మించారు. తండ్రి ర‌మ‌ణ‌, త‌ల్లి విజ‌య‌. జాతీయ‌స్థాయి వాలీబాల్ ప్లేయ‌ర్లు. సింధు అక్క దివ్య జాతీయ స్థాయిలో హ్యండ్‌బాల్ క్రీడాకారిణి. తండ్రి వాలీబాల్ ఆడ‌టానికి వెళ్లే స‌మ‌యంలో  సింధు తండ్రితో వెళ్లేవారు. అప్పుడే ప‌క్క‌న ఆడుతున్న బ్యాడ్మింట‌న్ సింధుని ఆక‌ర్షించింది. అదే తొలిసారి సింధుకు బ్యాడ్మింట‌న్ ప‌రిచ‌యం. అలా 8వ ఏట‌నే సింధు బ్యాడ్మింట‌న్ రాకెట్ ప‌ట్టారు. ఆ క్ష‌ణాన్నే భార‌తదేశానికి బ్యాడ్మింట‌న్ లో ప‌త‌కం సాధించే దారికి అడుగులు ప‌డ్డాయి. సింధు తండ్రి స‌హ‌జంగా క్రీడాకారుడు కావ‌డంతో ఆమెను ప్రోత్స‌హించారు. ఆట‌ ప‌ట్ల ఉన్న త‌ప‌న‌ చూసి తండ్రి త‌న ఉద్యోగం వ‌దిలేసి సింధు కోసం త‌న‌ వెంటే కోర్టులోనే ఉండేవారు. సింధు తండ్రి ర‌మ‌ణ అర్జున అవార్డు గ్ర‌హీత‌. వాలీబాల్ లో ఆయ‌న చేసిన సేవ‌ల‌కుగానూ ఈ అవార్డు అందుకొన్నారు. ఆయ‌నే ఆశ‌ర్య‌పోయేంత అంకిత‌భావంతో సింధు ప్రాక్టీస్ చేసేది.


ప్రాక్టీస్ ఇలా..


ఉద‌యం 4.30 నిమిషాల‌కు సింధుని గ్రౌండ్ కి తీసుకెళ్లేవారు తండ్రి ర‌మ‌ణ‌. సికింద్రాబాద్ రైల్వే బ్యాడ్మింట‌న్ ఇనిస్టిట్యూట్‌లో కోచ్ మ‌హ‌బూబ్ ఆలీ దగ్గ‌ర మెళ‌కువ‌లు నేర్చుకొంది సింధు. ఆ త‌ర్వాత తండ్రి.. కోచ్ పుల్లెల గోపీచంద్ ద‌గ్గ‌ర చేర్పించారు. సింధు అంద‌రి కంటే ముందు ఉద‌యం 5 గంటల క‌ల్లా కోర్టుకి వ‌చ్చి అంద‌రి కంటే చివ‌ర‌న వెళ్లేది. ఈ విష‌యం చాలా కాలంగా చూస్తోన్న కోచ్ గోపీచంద్‌కు సింధు
భార‌త బ్యాడ్మింట‌న్ ద‌శ‌ను మార్చేస్తుందని అనుకొన్నారు. ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరచగా.. ప్రాక్టీస్ లో సింధు రాటుదేలిపోయారు.


తొలి విజయం


సింధు 2012లో ఆసియా జూనియర్ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్థాయిలోకి దూసుకెళ్లారు. ఆ సంవత్సరం తరువాత, ఆమె ఆసియా యూత్ అండర్-19 ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. త‌రువాత  సింధు దృష్టి ఒలింపిక్స్ పై ప‌డింది. 2016లో రియోలో జ‌రుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొంది. మహిళల సింగిల్స్‌లో అప్ప‌టివ‌ర‌కు మ‌న‌ దేశానికి గ‌ట్టి ప్ర‌త్య‌ర్ధుల‌గా ఉన్న చైనా, కొరియా, జ‌పాన్ ష‌ట్ల‌ర్ల‌ను ఒక్కొక్క‌రిగా ఓడించి సింధు పైన‌ల్ చేరారు. అక్కడ ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. ఫైన‌ల్లో క‌రోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. కానీ కోట్లాది మంది భార‌తీయులే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులంద‌రూ ఒక్కసారిగా త‌న‌వైపు చూసేలా చేసింది. అంతేకాదు బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా చ‌రిత్ర సృష్టించింది.


2019లో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహరాను ఓడించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయురాలిగా సత్తా చాటారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సింధు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. బ్యాడ్మింట‌న్ పోటీల్లో దాదాపు అన్నింటిలో ప‌త‌కాలు సాధించింది సింధు. అంతర్జాతీయ సర్క్యూట్‌లో నిలకడగా మంచి ప్రదర్శన కనబరిచింది. BWF వరల్డ్ టూర్ ఈవెంట్‌లతో సహా పలు టోర్నమెంట్‌లలో అనేక టైటిళ్లు, పతకాలను గెలుచుకుంది. 


విమర్శలు సైతం


ఇక సింధుని కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా కోచ్ పుల్లెల గోపీచంద్ ని కాద‌ని విదేశీ కోచ్ ని నియ‌మించుకోవ‌డంతో విమ‌ర్శ‌ల పాల‌య్యారు. అలాగే దక్షిణ కొరియాకు చెందిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కిమ్ జి హ్యూన్, ఇండోనేషియా బ్యాడ్మింటన్ కోచ్ అయిన ముల్యో హాండోయో సింధుతో కలిసి కొంతకాలం పని చేశారు. త‌ర్వాత ప్ర‌స్తుత కొరియాకు చెందిన కోచ్ పార్క్‌ సాంగ్ కూడా రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం కొత్త కోచ్ కోసం సింధు అన్వేష‌ణ మొద‌లుపెట్టారు. ఇక‌, 2018 ఆసియా క్రీడల సందర్భంగా పివి సింధు జపాన్‌తో తమ మ్యాచ్‌కు ముందు, స్పాన్స‌ర్‌షిప్ దుస్తులు ధ‌రించ‌లేద‌ని వివాదం నెల‌కొంది. ఆయా స్పాన్స‌ర్లు ఒలింపిక్ అసోసియేష‌న్ కు కొంత సొమ్ము చెల్లిస్తారు. అలా త‌మ స్పాన్స‌ర్ ఉన్న దుస్తులు సింధు ధ‌రించ‌లేద‌ని భార‌తీయ స్పాన్స‌ర్ సంస్థ ఒలింపిక్ అసోసియేష‌న్ కి ఫిర్యాదు చేసింది. ఇది సంచలనం కలిగించింది.


ఇవీ అవార్డులు


121 సంవ‌త్ప‌రాల చ‌రిత్ర‌లో ఒలింపిక్స్ లో మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త విభాగంలో భార‌త‌దేశానికి కేవ‌లం 7 ప‌త‌కాలు మాత్ర‌మే ద‌క్కాయి. అందులో 2 ప‌త‌కాలు పి.వి.సింధు సాధించిన‌వే కావ‌డం విశేషం. 140 కోట్ల భార‌తీయుల్లో ఎవ‌రీకీ సాధ్యం కాని రికార్డ్‌ను సాధించి దేశం గ‌ర్వించ ద‌గ్గ ముద్దుబిడ్డ అయ్యారు సింధు. బ్యాడ్మింట‌న్ లో సింధు సేవ‌ల‌కు గాను అత్యున్నత పౌర పురస్కారాలైన‌ పద్మభూషణ్, పద్మశ్రీలతో కేంద్ర ప్ర‌భుత్వం గౌర‌వించింది. ఇన్ని విజ‌యాలు వ‌చ్చినా సింధు ఇంకా ఉద‌యం 4.30 గంట‌ల‌కు బ్యాడ్మింట‌న్‌ కోర్టులోనే ఉంటారు. విజ‌యాలు మ‌రింత శ్ర‌మించ‌డం నేర్పాయి సింధుకి. ఇదే అంకిత‌భావంతో  వ‌చ్చే ఒలింపిక్స్ లో కచ్చితంగా బంగారు ప‌త‌కం సాధిస్తాన‌ని మ‌రో ల‌క్ష్యం నిర్దేశించుకున్నారు సింధు.