విశ్వ క్రీడా సంబరంలో భారత్ పతకాల్లో బోణీ కొట్టింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకం సాధించింది. 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండో వెయిట్ లిఫ్టర్. మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్‌కు బోణి కొట్టారు.




మణిపుర్‌ నుంచి వచ్చిన మీరాబాయి చాను 1994, ఆగస్టు 8న ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్‌ కాక్‌చింగ్‌లో జన్మించింది. బాల్యంలో ఎక్కువగా మగపిల్లలతో తిరగడంతో ఆమెనంతా ఏడిపించేవారు. బడికెళ్లే వయసులో ఆమె విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజరాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. అప్పుడామెకు 12 ఏళ్లు. వంట కోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో అడవికి వెళ్లేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ.


 


మీరాబాయి స్వస్థలంలో ప్రొఫెషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ శిబిరాలు లేవు. దాంతో ఆమె రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్‌ అనితా చాను వెదురు బొంగులతో సాధన చేయిస్తూ టెక్నిక్స్‌ నేర్పించేది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఖరీదైన క్రీడ. సాధకులకు నాణ్యమైన పోషకాహారం అవసరం. మొదట్లో ఆమె వారానికి రెండుమూడు సార్లు మాత్రమే కోడిగుడ్లు, మాంసం తినేది. కొన్నాళ్ల తర్వాత కొన్ని సంస్థలు ఆమెకు స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడంతో మరింత కఠోరంగా శిక్షణ మొదలు పెట్టింది.


ఓటమి నేర్పిన పాఠం


2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో 48 కిలోల విభాగంలో రజతం గెలిచింది. ఎదగాలంటే ఒత్తిడితో కూడిన క్రీడల్లో పాల్గొనాలన్నది ఆమె మంత్రం. అలాగే చేసి 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైంది. అసలైన పోటీల్లో భారీ అంచనాల ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది. స్నాచ్‌లో మూడు అవకాశాల్లో ఒకసారే విజయవంతమైంది. మొదట 82కిలోలను ఎత్తలేక విఫలమై రెండో అవకాశంలో సాధించింది. మూడో దఫాలో 84 కిలోలు ఎత్తలేకపోయింది. ఇక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మూడుసార్లూ విఫలమైంది. తొలుత 103కిలోలు విఫలమైంది. విచిత్రంగా రెండోసారి 106 కిలోలు ఎంపిక చేసుకొని తడబడింది. మూడో అవకాశంలోనూ అంతే. గాయాల పాలై స్వదేశానికి చేరుకుంది. 


ఓటమి నుంచి కోలుకోవడానికి చానుకు చాలా సమయమే పట్టింది. కానీ, వాటన్నింటినీ తట్టుకుని వేట మొదలుపెట్టింది. రోజూ ఆరు గంటలకుపైగా సాధన చేసింది. కోచ్‌ల పర్యవేక్షణలో కొత్త మెలకువలు నేర్చుకుంది. ఎదగాలంటే త్యాగాలు అవసరమని గ్రహించి మొబైల్‌కు పూర్తిగా దూరమైంది. 


2017లో, అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె స్వర్ణం ముద్దాడింది. స్నాచ్‌లో 85 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 109 కిలోలు మొత్తం 194 కిలోలు ఎత్తింది. 2018, గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌లో స్నాచ్‌లో 86, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 110 మొత్తం 196 కిలోలతో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2019, థాయ్‌లాండ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగో స్థానంలో నిలిచినా.. జాతీయ రికార్డులు బద్దలు కొట్టింది. స్నాచ్‌లో 87, జర్క్‌లో 114 మొత్తం 201 కిలోలు ఎత్తింది. 2020, తాష్కెంట్‌ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 86.కి, 119.కి మొత్తం 206 కిలోలతో రికార్డులు బద్దలు చేసింది. అదే ఏడాది కోల్‌కతాలో నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 88కి, 115కి మొత్తం 203 కిలోలతో స్వర్ణం గెలిచింది. టోక్యోలోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేసింది. 87కి. 115కి. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది. 2018లో ఆమె రాజీవ్‌ ఖేల్‌రత్న, పద్మశ్రీని అందుకోవడం ప్రత్యేకం.