భారత బాక్సింగ్‌(Boxing)లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌(Mary Kom) ఆటకు వీడ్కోలు పలికారన్న వార్తల్లో నిజం లేదని ఆమె వివరణ ఇచ్చారు. 2012 ఒలింపిక్స్‌(2012 Olympics) పతక విజేత అయిన మేరీకోమ్‌ తన వయసు దృష్ట్యా రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వయోపరిమితిని కారణంగా పేర్కొంటూ క్రీడల నుంచి వైదొలుగుతున్నట్టు  ప్రకటించారని ఆ వార్తల సారాంశం. ఈ ప్రకటనతో భారత బాక్సింగ్‌లో స్వర్ణ యుగం ముగిసిందని అనుకున్నారు. కానీ దీనిపై ఏఎన్‌ఐతో వివరణ ఇచ్చారు. 

 

ఆడాలని ఉన్నా.. తప్పట్లేదు

41 ఏళ్ల మేరీకోమ్‌ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. తనకు బాక్సింగ్‌ నుంచి వైదొలగాలని లేదని, వయోపరిమితి దృష్ట్యా  కీలక  నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. బాక్సింగ్‌ రూల్స్‌ ప్రకారం ఎలైట్‌ లెవెల్‌లో ఆడాలంటే ఎవరికైనా 40 ఏళ్లే గరిష్ఠ వయో పరిమితి. ప్రస్తుతం మేరీ వయసు 41 కావడంతో తను ఆట నుంచి తప్పక వైదొలగాల్సి పరిస్థితి వచ్చింది. తనకు ఇంకా ఆడాలని ఉందని... దురదృష్టవశాత్తు వయస్సు తన ఆటకు అడ్డంకిగా మారిందని మేరికోమ్‌ తెలిపారు. ఇక నేను ఏ ఈవెంట్స్‌లోనూ పాల్గొనలేనని... తనకు ఇంకా ఎక్కువ రోజులు ఆడాలని ఉన్నప్పటికీ బలవంతంగా ఆట నుంచి వైదొలుగే పరిస్థితి ఉందన్నారు. తన జీవితంలో అనుకున్నవన్నీ సాధించానని వెల్లడించారు.

 

దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే రిటైర్మెంట్‌ అంటూ వార్తలు రాశారని మేరీకోమ్‌ వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అలాంటి  ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ మాట్లాడుతూ, "నేను ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించాలనుకున్నా మీడియా ముందుకు వచ్చే చెబుతాను.  నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. అది నిజం కాదు, నేను 24 జనవరి 2024న డిబ్రూఘర్‌లో జరిగిన ఒక పాఠశాల ఈవెంట్‌కు హాజరయ్యాను. అందులో నేను పిల్లలను ప్రోత్సహిస్తూ చేసిన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. “నాకు ఇప్పటికీ క్రీడల్లో సాధించాలనే కోరిక ఉంది, కానీ ఒలింపిక్స్‌లో వయో పరిమితి నాకు అడ్డంకిగా మారింది. అందులో పాల్గొనడానికి అనుమతి లేదు. నా ఆటతోపాటు ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాను. నేను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేస్తాను." అని విరవణ ఇచ్చారు. 

 

మేరికోమ్‌ ఓ చరిత్ర

తన 18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపుర్‌ స్టార్‌.. 48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్‌ చేరి చివరిమెట్టుపై బోల్తా పడింది. అనంతరం జరిగిన ఏఐబీఏ ఉమెన్స్‌ ప్రపంచ ఛాంపియన్‌లో విజేతగా నిలిచి భారత్‌ తరఫున బాక్సింగ్‌లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని మేరీ.. 2005, 2006, 2008, 2010లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. మేరీ కోమ్ 2012లో లండన్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం సాధించి, మహిళల బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్.. 2021లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. మేరీ 8 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, 7 ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు, 2ఆసియా క్రీడల పతకాలు, ఒక కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం సాధించింది. 2020లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగానూ వ్యవహరించారు. 2018లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ పోటీల్లో మరోసారి విజేతగా నిలిచింది. అంతర్జాతీయ పోటీల్లో అద్భత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధించిపెట్టిన మేరీకోమ్‌ గత కొద్ది రోజులుగా ఆటకు దూరంగా ఉన్నారు.

 

ఐరన్ లేడీ

మేరీ కోమ్‌ను ఐరన్ లేడీ అని కూడా అంటుంటారు. ఆ పేరు ఆమెకు ఊరికే రాలేదు. బాక్సింగ్ రింగ్‌లోనే కాదు, నిజజీవితంలోనూ ఆమె సమస్యలతో పోరాటం చేశారు. 2011లో ఆమె మూడున్నర ఏళ్ల కుమారుడికి గుండె ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో ఆమె ఆసియా కప్ కోసం చైనా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఏం చేయాలో తోచనప్పుడు ఆమెకు భర్త అండగా నిలిచారు. కొడుకును భర్త సంరక్షణలో వదిలి ఆమె ఆసియా కప్‌కు వెళ్లారు. అక్కడ స్వర్ణపతకం సాధించి తిరిగి వచ్చారు.