2016 ఐపీఎల్ సీజన్ విరాట్ కోహ్లీకి చాలా స్పెషల్. ఐపీఎల్‌లోనే కెరీర్ బెస్ట్ ఫాంను ఆ సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో నాలుగు సెంచరీలతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ఆ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్ అయితే ఇంకా స్పెషల్. చేతికి తొమ్మిది కుట్లతో ఆడుతూ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌ను విరాట్ కనపరిచాడు. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 113 పరుగులు సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత తన సెలబ్రేషన్స్ ఎవరూ మర్చిపోలేరు. ఆ ఇన్నింగ్స్‌కు నేటితో ఆరేళ్లు నిండాయి. 2016లో మే 18వ తేదీన ఈ మ్యాచ్ జరిగింది.


వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు క్రిస్ గేల్ (73: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) కూడా చెలరేగి ఆడాడు. చివర్లో కేఎల్ రాహుల్ కూడా ఒక చేయి వేయడంతో బెంగళూరు 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పంజాబ్ 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 120 పరుగులకే పరిమితం అయింది.


ఇక ఈ సీజన్‌లో కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 236 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క సీజన్లోనే కోహ్లీ మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం విశేషం. తన సగటు కేవలం 19.67 కాగా... స్ట్రైక్ రేట్ కూడా 113.46గానే ఉంది. మొత్తం సీజన్లో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే సాధించాడు.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు కూడా ఈ సీజన్‌లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నెటరన్‌రేట్ నెగిటివ్‌లో ఉండటం బెంగళూరుకు కలిసిరాని అంశం. తర్వాతి మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు మిగతా జట్లు భారీ తేడాతో ఓడిపోవడం కూడా బెంగళూరుకు అవసరం. మరి వీటన్నిటినీ దాటుకుని బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందో లేదో కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.