IPL Mega Auction 2022 Preview:  ఐపీఎల్‌-15 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. బహుశా బీసీసీఐ నిర్వహించే చివరి అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది. పది జట్ల వ్యూహకర్తలు, ప్రతినిధులు, యజమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఐపీఎల్‌ పాలక మండలి మెగా వేలాన్ని పర్యవేక్షిస్తున్నారు.


స్పాన్సర్‌గా టాటా


ఈ సీజన్‌కు టాటా కంపెనీ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపుగా 600 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 217 మందిని ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి. భారత్‌ నుంచి దాదాపు 370 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.


గరిష్ఠ సంఖ్య 25


ఒక్కో ఫ్రాంచైజీ మొత్తం 25 మంది క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో గరిష్ఠంగా 8 మంది విదేశీయులు మాత్రమే ఎంచుకోవాలి. వేలంలో ఆటగాళ్ల కనీస ధరలు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.కోటి, రూ.కోటిన్నర, రూ.2 కోట్లుగా ఉన్నాయి.


ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని లైవ్ చూడటం ఎలా?


ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరగనుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేలం జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీలో ఈ వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో కూడా ఈ మెగా వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు.


ఈ వేలంలో మొత్తంగా 590 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఆటగాడికి ఫిక్స్‌డ్ బేస్ ప్రైస్ ఉంటుంది. అత్యధిక బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. మొత్తంగా 48 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.


వేలానికి పేర్లు నమోదు చేసుకున్న 590 మందిలో 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. అలాగే అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్న ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. వేలంలో అందుబాటులో ఉన్న వారిలో 370 మంది ఆటగాళ్లు భారతీయులు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు.


ఈ మెగా వేలంలో అత్యధిక నిధులు పంజాబ్‌ కింగ్స్‌ వద్ద ఉన్నాయి. వారు రూ.72 కోట్లతో బరిలోకి దిగనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద అతి తక్కువగా రూ.47 కోట్లు ఉన్నాయి.  ఆస్ట్రేలియా నుంచి 47 మంది, వెస్టిండీస్‌ నుంచి 34 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.



ఎవరి వద్ద ఎంత డబ్బుంది?



  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వారివద్ద ఎంఎస్‌ ధోనీ, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌ను రీటెయిన్‌ చేసుకున్నారు.

  • దిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.47.50 కోట్లు ఉన్నాయి. వీరు రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, అక్షర్‌ పటేల్‌, ఆన్రిచ్‌ నార్జ్‌ను రీటెయిన్‌ చేసుకున్నారు.

  • గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ.52 కోట్లు ఉన్నాయి. ఈ కొత్త జట్టు హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌ను డ్రాఫ్ట్‌ చేసింది.

  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌ను అట్టిపెట్టుకున్నారు.

  • లక్నో సూపర్‌జెయింట్స్‌ వద్ద రూ.59 కోట్లు ఉన్నాయి. కేఎల్‌ రాహుల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, రవి బిష్ణోయ్‌ను డ్రాఫ్ట్‌ చేశారు.

  • ముంబయి ఇండియన్స్‌ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌, జస్ప్రీత్‌ బుమ్రాను రీటెయిన్‌ చేసుకుంది.

  • పంజాబ్‌ కింగ్స్‌ వద్ద అత్యధికంగా రూ.72 కోట్లున్నాయి. కేవలం మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ను అట్టిపెట్టుకున్నారు.

  • రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద రూ.62 కోట్లు ఉన్నాయి. వీరు సంజు శాంసన్‌, జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ను రీటెయిన్‌ చేసుకున్నారు.

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వద్ద రూ.57 కోట్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌ను అట్టిపెట్టుకున్నారు.

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ.68 కోట్లు ఉన్నాయి. వీరు కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ను రీటెయిన్‌ చేసుకున్నారు.