అహ్మదాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) లో 16 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. బుధవారం (ఏప్రిల్ 3న) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కత్తా నైట్ రైడర్స్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో భారీ రన్ రేటు తమ ఖాతాలో వేసుకుని కేకేఆర్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 17వ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) గురువారం తలపడనున్నాయి. ఆడిన మూడు గేమ్‌లలో జీటీ 2 నెగ్గి, ఓ మ్యాచ్ లో ఓడింది. మరోవైపు పంజాబ్ PBKS తొలి మ్యాచ్ నెగ్గి, వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో ఇది తమ మూడో హోమ్ కు సన్నద్ధమైంది. PBKS ప్రత్యర్థి హోం గ్రౌండ్‌లో వరుసగా మూడో మ్యాచ్ ఆడబోతోంది. 


అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకున్న గుజరాత్(GT) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. ఆపై సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ జీటీ ఛేజింగ్ ను తేలిక చేశారు. మరోవైపు శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ తొలి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఆపై ఆర్సీబీ (RCB), లక్నో (LSG)తో జరిగిన మ్యాచ్‌లలో ఓటములు తప్పలేదు.


నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్ లోని నరేందర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించడం లేదు. స్కోరు చేయడానికి బ్యాటర్లు శ్రమించాల్సి ఉంటుంది. ఈ వేదికపై ఇప్పటివరకు 29 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 14 మ్యాచ్‌లలో నెగ్గగా.. ఛేజింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్‌లలో గెలుపొందింది. టాస్ నెగ్గిన టీమ్ బౌలింగ్ ఎంచుకుంటే మేలు. ఛేజింగ్ చేసే టీమ్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ బ్యాటర్ల సహనానికి పరీక్ష పెట్టేలా పిచ్ తయారు చేస్తున్నారు. 


మొదటి ఇన్నింగ్స్ సగటు మొత్తం 172 పరుగులుగా ఉంది. ఈ వేదికలో హయ్యస్ట్ ఛేజింగ్ స్కోరు 205. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 233/3. ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు 102. టాస్ నెగ్గిన జట్టు 13 మ్యాచ్‌లలో నెగ్గగా, టాస్ ఓడిన టీమ్ 16 మ్యాచ్‌లలో గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 


వీరి పోరు ఆసక్తికరం
అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2 మ్యాచ్‌లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 168 రన్స్, 162 పరుగులు చేశారు. శుభమాన్ గిల్ vs అర్ష్‌దీప్ సింగ్, రషీద్ ఖాన్ vs జానీ బెయిర్‌స్టో పోరు ఆసక్తికరంగా మారనుంది. అర్ష్‌దీప్ సింగ్ 6 ఇన్నింగ్స్‌లలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ను ఒక్కసారి ఔట్ చేశాడు. కానీ అర్ష్ దీప్ బౌలింగ్ లో రన్స్ చేసేందుకు గిల్ కొంచెం ఇబ్బంది పడతాడు. మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో రషీద్ ఖాన్ బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 4 సార్లు అవుట్ అయ్యాడు. రషీద్ బౌలింగ్ లో ధావన్ స్ట్రైక్ రేట్, బ్యాటింగ్ యావరేజ్ తక్కువే.