ఐపీఎల్‌లో ఈ సంవత్సరం కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరిన సంగతి తెలిసిందే. వీటిలో లక్నో జట్టును సంజీవ్ గోయెంకా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ అని పేరు ఫిక్స్ చేశారు. గతంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు కూడా గోయెంకా గ్రూపుదే. ఇప్పుడు ఆ పేరునే లక్నోకు కూడా ఫిక్స్ చేశారు.


ప్రస్తుతం లక్నో దగ్గర కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లు ఉన్నారు. వీరిలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్‌కు రూ.17 కోట్లు, మార్కస్ స్టోయినిస్‌కు రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం పొందిన ఆటగాడిగా రాహుల్ మారాడు.


ఐపీఎల్ 2022కు సంబంధించిన మెగా వేలం కూడా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనుంది. ఈ వేలం అయ్యాక ఏయే జట్లలో ఎవరెవరు ఉంటారో క్లారిటీ రానుంది. జట్టు పేరును టీమ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది.