విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన సినిమా 'సామాన్యుడు'. నాట్ ఏ కామన్ మ్యాన్... అనేది ఉపశీర్షిక. తమిళంలో 'వీరమే వాగై సూడుం' పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నెల 19న ట్రైలర్ విడుదల చేశారు. సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... ఆ రోజున సినిమా రిలీజ్ కావడం లేదు. విడుదల వాయిదా వేశారని తెలుస్తోంది.


ప్రస్తుతం తమిళనాడులో కరోనా కేసులు బాగా ఉన్నాయి. జనవరి 9 నుంచి అక్కడ ప్రతి ఆదివారం లాక్ డౌన్ ప్రకటించారు. శనివారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం ఐదు గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది. వీక్ డేస్‌లోరాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకూ క‌ర్ఫ్యూ విధించారు. ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కంటిన్యూ చేయాలని తమిళనాడు సర్కార్ నిర్ణయించడంతో 'సామాన్యుడు' సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఆంక్షలు ఎత్తేస్తే... ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తేదీకి సూర్య సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి భారీ సినిమాలు వాయిదా పడటంతో తన సినిమాను విడుదల చేయాలని విశాల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా తమిళనాట కరోనా ఆంక్షలు అతడిని వెనకడుగు వేసేలా చేశాయి. ఆ తర్వాత ముందుగా అనుకున్న జనవరి 26కి వద్దామని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది కూడా కుదిరేలా కనిపించడం లేదు.


'సామాన్యుడు' సినిమా చూస్తే... యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన క్రైమ్ స్టోరీగా తెలుస్తోంది. యాక్ష‌న్ సీన్స్‌లో విశాల్ ఎప్ప‌టిలా క‌నిపించాడు. అయితే... డింపుల్ హయతితో రొమాంటిక్ సీన్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి తదితరులు నటించిన ఈ సినిమాకు తు ప శరవణన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. జనవరి 26న సినిమా విడుదల కావడం లేదనే విషయాన్నీ రేపో మాపో 'సామాన్యుడు' టీమ్  అనౌన్స్ చేస్తుందేమో!?


Also Read: మారుతి సినిమా చేయడానికి ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పాడు?
Also Read: జనవరి 24 ఎపిసోడ్: నాన్నకు ప్రేమతో రిషి... జగతిని ఇంటికి తీసుకొస్తాడా? మధ్యలో వసు రాయబారమా... ? 'గుప్పెడంత మనసు' సోమవారం ఎపిసోడ్ లో ఏం జ‌రిగింది అంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి