ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు.. ముంబైని 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆర్సీబీ తరఫున హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీయడం, తనకు చాహల్, మ్యాక్స్‌వెల్, సిరాజ్ సహకారం అందించడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ముంబైని కట్టడి చేయగలిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు 165 పరుగులు సాధించింది. తర్వాత ముంబై 111 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో బెంగళూరు మూడో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, ముంబై ఏడో స్థానానికి పడిపోయింది.


చివర్లో బొక్కబోర్లా..
టాస్ ఓడి ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగళూరుకు సరైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫాంలో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్‌ను(0: 4 బంతుల్లో) అవుట్ చేసి బుమ్రా ముంబైకి మొదటి వికెట్ అందించాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ(50: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు)కి, తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్(32: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరును వికెట్ నష్టానికి 48 పరుగులకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భరత్ అవుటయ్యాడు. దీంతో కోహ్లికి, మ్యాక్స్‌వెల్ జతకలిశాడు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులకు చేర్చారు.


కోహ్లీ, మ్యాక్స్‌వెల్ జోడీ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కోహ్లీ కూడా తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన వెంటనే.. విరాట్ కోహ్లీ మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌ను వరుస బంతుల్లో అవుట్ చేసి బుమ్రా బెంగళూరును తిరుగులేని దెబ్బ కొట్టాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితం అయింది. చివరి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేయడం బెంగళూరు భారీ స్కోరు చేయలేకపోయారు. బుమ్రా మూడు వికెట్లు తీయగా, బౌల్ట్, మిల్నే, చాహర్ తలో వికెట్ తీశారు.


Also Read: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. టీ20ల్లో తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్


ఎక్కడా తగ్గలేదు..
ఇక ముంబై ఇండియన్స్‌కు మాత్రం అదిరిపోయే ఆరంభం లభించింది. జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ(43: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), క్వింటన్ డికాక్(24: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు) చెలరేగి ఆడారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. అయితే పవర్‌ప్లే అయిపోగానే డికాక్‌ను అవుట్ చేసి చాహల్ బెంగళూరుకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో రోహిత్ శర్మ.. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్లు కోల్పోయి.. 79 పరుగులు చేశారు.


ఆ తర్వాత కూడా ముంబై వికెట్ల పతనం ఆగలేదు. ఇషాన్ కిషన్ (9: 12 బంతుల్లో, ఒక ఫోర్), కృనాల్ పాండ్యా (5: 11 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్  (8: 9 బంతుల్లో) ముగ్గురూ విఫలం కావడంతో ముంబై 15 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. అప్పటికి 30 బంతుల్లో 69 పరుగులు కావాలి. అయితే హార్దిక్ పాండ్యా (3: 6 బంతుల్లో), పొలార్డ్ (7: 10 బంతుల్లో), రాహుల్ చాహర్‌లను(0) వరుస బంతుల్లో అవుట్ చేసి ముంబైకి విజయాన్ని దూరం చేయడంతో పాటు హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత బుమ్రాను చాహల్, మిల్నేను హర్షల్ అవుట్ చేయడంతో ముంబై 18.1 ఓవర్లలో 111కు ఆలౌటైంది. ఓపెనర్లు మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. హర్షల్ పటేల్ (17/4),  చాహల్ (11/3), మ్యాక్స్‌వెల్ (23/2), సిరాజ్(15/1) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై కేవలం 32 పరుగుల వ్యవధిలోనే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.


Also Read: ఆస్ట్రేలియా మహిళల జట్టుపై రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం.. 26 వరుస విజయాలకు బ్రేక్!


Also Read: సన్‌రైజర్స్ ఇంటికే.. ఐదు పరుగులతో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి