ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా వెంకటేష్ అయ్యర్‌(67: 49 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ త్రిపాఠి (34: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), నితీష్ రాణా (31: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. అనంతరం పంజాబ్‌లో కేఎల్ రాహుల్ (67: 55 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మయాంక్ అగర్వాల్ (40: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మినహా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు అవుట్ అయ్యారు. ఆఖరిలో కేఎల్ రాహుల్ కూడా అవుటైనా షారుక్ ఖాన్ (22: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవ్వగా... కోల్‌కతా కాస్త ప్రమాదంలో పడింది. ఈ విజయంతో పంజాబ్ ఐదో స్థానానికి రాగా.. కేకేఆర్ నాలుగో స్థానంలోనే ఉంది.


మళ్లీ వెంకటేష్ మెరుపులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లోనే ఫాంలో ఉన్న గిల్‌(7: 5 బంతుల్లో, ఒక ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేసి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (34: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌(67: 49 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా పంజాబ్ బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో వీరు మరింత చెలరేగి ఆడారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది.


ఆ తర్వాత కాసేపటికే కోల్‌కతాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠి.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 15 ఓవర్లు జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 121 పరుగులుగా ఉంది. ఆ తర్వాత నితీష్ రాణా (31: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడాడు. ఇయాన్ మోర్గాన్ (2: 2 బంతుల్లో) మళ్లీ విఫలం అయ్యాడు. తర్వాత బ్యాట్స్‌మెన్ ఎవరూ వేగంగా ఆడలేకపోవడంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.


Also Read: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్‌ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్‌


రాహుల్ వన్‌మ్యాన్ షో..
ఛేజింగ్‌కు దిగిన పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (40: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), కేఎల్ రాహుల్ కోల్‌కతా బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు లభించింది. మొదటి వికెట్‌కు 70 పరుగులు జోడించిన అనంతరం వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. ఈ క్రమంలోనే పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది.


ఆ తర్వాత వెంటనే పూరన్‌ను (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. దీంతో రెండు కీలకమైన వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 43 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకుని, అప్పుడే బ్యాట్ ఊపడం మొదలు పెట్టిన మార్క్రమ్‌ను (18: 15 బంతుల్లో, ఒక సిక్సర్) నరైన్ పెవిలియన్ బాట పట్టించాడు. అయితే కేఎల్ రాహుల్ అవసరమైన రన్‌రేట్ పెరిగిపోకుండా చూశాడు. విజయానికి నాలుగు పరుగుల దూరంలో తను అవుటైనా.. షారుక్ ఖాన్ మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకోగా.. శివం మావి, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ తలో వికెట్ తీశారు. 


Also Read: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు


Also Read: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి