టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టుపై పాకిస్తాన్ మహిళా బ్యాటర్లు చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బిస్మా మరూఫ్ (68 నాటౌట్: 55 బంతుల్లో, ఏడు ఫోర్లు), ఆయేషా నసీం (43 నాటౌట్: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిని అవుట్ చేయడం భారత బౌలర్ల వల్ల కాలేదు. టీమిండియా గెలవాలంటే 120 బంతుల్లో 150 పరుగులు సాధించాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వారి ఇన్నింగ్స్‌కు ఆశించిన ప్రారంభం లభించలేదు. స్కోరు బోర్డుపై 10 పరుగులు చేరేసరికే ఓపెనర్ జవేరియా ఖాన్ పెవిలియన్ బాట పట్టింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్ మునీబా అలీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన నిదా దార్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఇక అమీన్ అయితే బోలెడన్ని బంతులు వృథా చేసింది. ఈ నాలుగు వికెట్లు కోల్పోయే సరికి పాకిస్తాన్ స్కోరు 12.1 ఓవర్లలో 68 పరుగులు మాత్రమే.


అయితే వీరి తర్వాత వచ్చిన ఆయేషా నసీం (43 నాటౌట్: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడింది. కేవలం సిక్సర్లు, బౌండరీలు మాత్రమే కాకుండా సింగిల్స్, డబుల్స్‌పై కూడా ఎక్కువ దృష్టి పెట్టడంతో స్కోరు వేగం ఎక్కడా నెమ్మదించలేదు. బిస్మా మరూఫ్ (68 నాటౌట్: 55 బంతుల్లో, ఏడు ఫోర్లు) మొదట్లో నిదానంగా ఆడినా తర్వాత తను కూడా చెలరేగి ఆడింది. ఎడాపెడా బౌండరీలు బాదింది.


వీరిద్దరూ ఐదో వికెట్‌కు 47 బంతుల్లోనే అజేయంగా 81 పరుగులు జోడించారు. ఇక చివరి ఐదు ఓవర్లలోనే పాకిస్తాన్ ఏకంగా 58 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మహిళల టీ20ల్లో 150 అంటే కొంచెం కష్టమైన లక్ష్యమే. భారత జట్టు దీన్ని ఎంతమేరకు సాధిస్తుందో చూడాలి.


పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI)
జవేరియా ఖాన్, మునీబా అలీ(వికెట్ కీపర్), బిస్మాహ్ మరూఫ్(కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్


భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్