IND W vs PAK W T20 Match: గెలుపంటే ఇదీ! బ్యాటింగ్‌ అంటే ఇలాగే చేయాలి! ప్రత్యర్థిని ఓడించే పద్ధతి ఇదీ! పాకిస్థాన్‌పై చెలరేగితే ఈ విధ్వంసం కనిపించాలి! కామన్వెల్త్‌ క్రీడల్లో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. వంద కోట్లకు పైగా భారతీయులను హర్మన్‌ ప్రీత్‌ సేన సంతోషంలో ముంచెత్తింది. మరో అంతర్జాతీయ వేదికలో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి సగర్వంగా నిలిచింది!


ఆరంభం నుంచీ!


ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 లీగు మ్యాచులో భారత అమ్మాయిలు తిరుగులేని విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్దేశించిన 100 పరుగుల  టార్గెట్‌ను మంచినీళ్లు తాగినంత ఈజీగా ఛేదించేశారు. కేవలం 11.4 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించారు. ఓపెనర్‌ స్మృతి మంధాన (63*; 42 బంతుల్లో 8x4, 3x6) ఆకలిగొన్న పులిలా విరుచుకుపడింది. అంతకు ముందు పాక్‌లో మునీబా అలీ (32; 30 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. వర్షం కారణంగా మ్యాచును 18 ఓవర్లకు కుదించారు.




భీకర ఫామ్లో స్మృతి 


కొడితే సిక్సర్‌ లేదంటే బౌండరీ అన్నట్టుగా బంతిని బాదేసింది స్మృతి మంధాన. జస్ట్‌ బౌండరీలతో డీల్‌ చేసిందంతే. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి బాదడం మొదలు పెట్టింది. ఆమెకు తోడుగా షెఫాలీ వర్మ (16; 9 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడటంతో భారత్‌ 5 ఓవర్ల లోపే 50 పరుగులు చేసింది. 61 వద్ద షెఫాలీ ఔటైనా స్మృతి ఆగలేదు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసింది. అదీ క్రీజులోంచి బయటకు దూకి.. బంతిని లాఘవంగా భారీ సిక్సర్‌గా బాదేసి అందుకోవడం ప్రత్యేకం. షెఫాలీ ఔటయ్యాక తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (14; 16 బంతుల్లో 2x4) ఆమెకు అండగా నిలిచింది. దీంతో 10 ఓవర్లకు టీమ్‌ఇండియా 92/1తో నిలిచింది. ఆ తర్వాత మేఘన ఔటైనా జెమీమా (2)తో కలిసి స్మృతి గెలిపించేసింది.


బౌలర్లూ భయపెట్టారు


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు శుభారంభం దక్కలేదు. ఒక పరుగు వద్దే ఓపెనర్‌ ఇరామ్‌ జావెద్‌ (0)ను మేఘనా సింగ్‌ డకౌట్‌ చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌ (17)తో కలిసి మరో ఓపెనర్‌ మునీబా అలీ నిలకడగా ఆడింది. ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదింది. దాంతో పవర్‌ప్లేలో పాక్‌ 25/1తో నిలిచింది. స్నేహా రాణా బంతి అందుకోవడంతో వారి పతనం మొదలైంది. జట్టు స్కోరు 50 వద్ద బిస్మా, 51 వద్ద ముబీనాను ఔట్‌ చేసింది. ఈ క్రమంలో ఒమైమా సొహైల్‌ (10), అయేషా నసీమ్‌ (10), అలియా రియాజ్‌ పోరాడే (18) ఇన్నింగ్స్‌ నిలబట్టే ప్రయత్నం చేశారు. కీలక సమయాల్లో భారత బౌలర్లు వారిని పెవిలియన్‌ పంపించడంతో పాక్‌ 99కి పరిమితమైంది. స్నేహ్‌ రాణా (2/15), రాధా యాదవ్‌ (2/18) బౌలింగులో రాణించారు.