India And Bangladesh Final T20 Match: ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టీమిండియా 297 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది. అయితే, చివరి రెండు ఓవర్లలో కాస్త తడబడడంతో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుకు (314) కాస్త దూరంలో నిలిచింది. దీంతో ప్రపంచ రికార్డు కొద్దిలో మిస్ అయినట్లయింది. అయితే, ఇండోర్‌లో శ్రీలంకపై 2017లో చేసిన 260 పరుగుల సొంత రికార్డును అధిగమించింది. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడింది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విజృంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (4 పరుగులు) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. 


బంగ్లా ఆటగాడు రిషద్ వేసిన పదో ఓవర్‌లో సంజూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో రెండో బంతి మినహా అన్నీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అటు, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులు చేశారు. నీతీశ్ రెడ్డి డకౌట్‌గా వెనుదిరిగాడు. రింకూ సింగ్ (8) నాటౌట్‌గా నిలిచాడు. అటు, బంగ్లా బౌలర్లలో షకీబ్ 3, టస్కిన్, ముస్తఫిజుర్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.


బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ రికార్డులివే..


కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ పలు రికార్డులు నమోదు చేసింది. 47 బౌండరీలు బాది టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదు చేసింది. టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యదిక స్కోర్ (297) ఇదే. టీ20ల్లో బెస్ట్ పవర్ ప్లే స్కోర్ (82/1). 



  • 7.1 ఓవర్లలోనే వేగవంతంగా 100 పరుగులు సాధించింది. మొదటి 10 ఓవర్లలోనే 146/1 బెస్ట్ స్కోర్ చేసింది.

  • టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచారు. టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రెండో టీమ్‌గా రికార్డు నెలకొల్పింది.

  • 14 ఓవర్లలోనే 200 పరుగులు చేసి వేగవంతమైన స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. 

  • భారత ఇన్నింగ్స్‌లోనే ఆటగాళ్లు అత్యధికంగా 22 సిక్సర్లు బాదారు.


Also Read: Womens T20 World Cup: టీ 20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా ! టోర్నీ నుంచి పాక్ అవుట్ ?